- Home
- Telangana
- గవర్నర్ తమిళిసై వద్దే 12 బిల్లులు.. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాజ్భవన్ లొల్లి తప్పదా?
గవర్నర్ తమిళిసై వద్దే 12 బిల్లులు.. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాజ్భవన్ లొల్లి తప్పదా?
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసైకి సంబంధించిన ప్రోటోకాల్, బిల్లుల క్లియరెన్స్, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ఇలా చాలా విషయాలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి.

తాజాగా కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ల మధ్య మరోసారి పెండింగ్ బిల్లుల విషయంలో వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య పెండింగ్ బిల్లల పంచాయితీ.. సుప్రీం కోర్టు వరకు కూడా చేరింది. అయితే అప్పటికీ ఆ వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఇప్పుడు మరోసారి బిల్లులకు ఆమోదం అంశం మరోసారి అగ్గిరాజేసే అవకాశం కనిపిస్తుంది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే.. చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి.
బిల్లుల విషయానికి వస్తే.. గతంలో గవర్నర్ తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన ఒక బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మళ్లీ గవర్నర్ వద్దకు పంపారు. ఈ జాబితాలో తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు- 2022, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు- 2022 ఉన్నాయి.
అయితే గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను రెండోసారి సభ ఆమోదించిన నేపథ్యంలో.. వాటిని గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని రాజ్యాంగ నిబంధనలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు మరో మార్గం లేదని వారు చెబుతున్నారు.
ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా 8 బిల్లులను ఆమోదించారు. ఆ జాబితాలో తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023, తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023, తెలంగాణ ఆర్టీసీ బిల్లు (ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం) – 2023, తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023, తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023, తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023, ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023, టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ 12 బిల్లులు కూడా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసి ఆరు రోజులు గడిచిన ఇప్పటివరకు గవర్నర్ వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మరికొన్ని రోజులు ఈ బిల్లులపై గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. మరోసారి ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య జగడం రాజుకునే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల తీర్మానం చేసి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి కూడా గవర్నర్ తమిళిసై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారికి ఉన్న అర్హతలను తమిళిసై పరిశీలిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే గతంలో గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా కేబినెట్ నామినేట్ చేయడం.. అందుకు గవర్నర్ అంగీకారం తెలుపకపోవడం పెద్ద రచ్చకే దారితీసిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఎలాంటి పరిణాలు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.