నిజామాబాద్ ఎంపీ అరవింద్ పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని మోదీ
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ దంపతులు తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబసమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం కుటుంబసమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని కాస్సేపు తన పిల్లలతో సరదాగా గడిపారని... ఎంతో ఆప్యాయంగా వారిని దగ్గరకు తీసుకుని ముచ్చటించారని అరవింద్ తెలిపారు.
అరవింద్ దంపతుల 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రధానికి కలిశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ వీరికి సమయం కేటాయించిన ప్రధాని అరవింద్ పిల్లలకు స్వయంగా తానే స్వీట్లు అందించారు.
''వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం లభించింది. మాతో పాటు మా పిల్లలు సమన్యు(12) మరియు రుద్రాక్ష్ (4) కూడా కలవగా, ప్రధాని వారితో చాలా సేపు ముచ్చటించి, చిన్నవాడైన రుద్రాక్ష్ తో సరదాగా గడిపి, సమన్యుని తన చదువు, క్రీడలపై ఆసక్తి గూర్చి కనుక్కున్నారు'' అంటూ ప్రధానిని కలిసి ఫోటోలనే జతచేస్తూ సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకున్నారు ఎంపీ అరవింద్.