రాజ్యసభకు కవిత: కేశవరావుకు మొండిచెయ్యేనా?
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కవితను రాజ్యసభకు పంపాలని యోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు కవిత ను రాజ్యసభకు పంపేందుకు టిఆర్ఎస్ నాయకత్వం పంపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు రిటైర్ కానున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా విభజించారు.
రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావును ఏపీ రాష్ట్రానికి అలాట్ చేశారు.తెలంగాణ నుంచి రిటైర్ కానున్న ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో ఒకరు కె.కేశవరావు కాగా మరొకరు గరికపాటి మోహన్ రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరికపాటి మోహన్ రావు టిడిపి తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు
గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మోహన్ రావు టిడిపిని వీడి బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రెండు రాజ్యసభ పదవులు కూడా ఆ పార్టీకే దక్కనున్నాయి.
రాజ్యసభ ఎన్నికలను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ నుండి టి ఆర్ ఎస్ తరఫున రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.
గతేడాది జరిగిన ఎన్నికల్లో నిజాంబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన కల్వకుంట్ల కవిత ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగుతోంది. 2014 నుండి 2019 వరకు ఆమె నిజామాబాద్ నుండి ఎంపీగా కొనసాగారు.
గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ దఫా కవితను రాజ్యసభకు ఎంపిక చేస్తారని ప్రచారం సాగుతోంది.
ఇక రెండో సీటు ఎవరికి దక్కుతోందో అనే విషయమై జోరుగా చర్చసాగుతోంది. కేశవరావుకు మరోసారి అవకాశం కల్పిస్తారా లేదా అనే చర్చ కూడా సాగుతోంది.వయస్సు రీత్యా కేశవరావుకు అవకాశం కల్పించే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
రెండో సీటు కోసం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ సీటును నామా నాగేశ్వరరావు కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్యాగం చేశారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు .
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ లో చేరిన కెఆర్ సురేష్ రెడ్డికి సముచితమైన పదవి కట్టబెడతామని ఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకూ ఆయనకు పదవి కట్టబెట్ట లేదు.
దీంతో రాజ్యసభ సీటుపై సురేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టిఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది