మీది ఇదే జిల్లానా... అయితే మీ అకౌంట్లో ఫ్రీగా రూ.6 వేలు, పడ్డాయేమో చెక్ చేసుకొండి
తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేదిశగా ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే రెండు జిల్లాల లబ్దిదారుల అకౌంట్స్ లో రూ.6 వేల చొప్పున వేసింది. ఇంతకూ ఈ పథకం ఏమిటి? అమలుచేసిన ఆ జిల్లాలేమిటో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Indiramma Atmiya Bharosa
Indiramma Atmiya Bharosa : తెలంగాణ ప్రభుత్వం నిరుపేద రైతు కూలీలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల సమయంలో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హామీని పైలట్ ప్రాజెక్ట్ గా మండలానికి ఓ గ్రామం చొప్పున అమలు చేసారు... ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన రైతుకూలీల ఖాతాల్లో డబ్బులు వేయడం ప్రారంభించింది.
భూమిలేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మొదటి విడతగా రూ.6,000 జమ చేస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన రైతుకూలీల ఖాతాల్లో ఈ డబ్బులు పడుతున్నాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు జరిగే జిల్లాలో కోడ్ అమల్లో ఉంది... దీంతో ఆ జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేయలేకపోతోంది ప్రభుత్వం. ఇలా కేవలం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మిగతా జిల్లాల కూలీల ఖాతాల్లో కూడా ఆత్మీయ భరోసా డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
Indiramma Atmiya Bharosa
ఇప్పటివరకు ఎంతమందికి ఆత్మీయ భరోసా దక్కింది...
గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం భూమి కలిగిన రైతులకే 'రైతు బంధు' పేరిట పెట్టుబడి సాయం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు పెట్టుబడి సాయం పెంచుతూనే... భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంతభూమి లేక వ్యవసాయ కూలీ పనులు చేసుకునే పేదలకు ఏడాదికి రూ.12,000 అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని గత జనవరి 26, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడం ప్రారంభించారు.
స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో 100 శాతం లబ్దిదారులకు పథకాలను అమలుచేసారు... అందులో ఈ అత్మీయ భరోసా పథకం ఒకటి. ఇలా గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని 18,180 మంది రైతు కూలీలకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
అయితే ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని భావించినా ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డుపడ్డాయి. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్... ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో టీచర్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ రావడంతో ఎలాంటి కొత్తగా పథకాలను అమలుచేయడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో మిగిలిన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని రైతు కూలీలకు మాత్రమే ప్రస్తుతం ఆత్మీయ భరోసా డబ్బులు వేసారు.
ఈ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించింది ప్రభుత్వం. ఇందుకోసం రూ.39.74 కోట్లు విడుదల చేసింది. ఈ జిల్లాల్లో అర్హులైన ప్రతి రైతుకూలీ అకౌంట్లో డబ్బులు వేసామని ప్రభుత్వం చెబుతోంది.
గతంలో ప్రతి మండలంలోని ఓ గ్రామంలోని అందరు రైతుకూలీలకు, ఇప్పుడు రెండు జిల్లాల్లోని వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అందాయి. ఇలా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 83,420 మంది ఉపాధి కూలీలకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు చెల్లించామని... ఇందుకోసం రూ.50.65 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఇటీవల ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి సీతక్క కోరారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింద.ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు తమ ప్రభుత్వం పెద్దదిక్కుగా నిలుస్తోందని అంటున్నారు. ఒక సీజన్ కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తున్నామని... డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు గర్వంగా చెబుతున్నారు.
Indiramma Atmiya Bharosa
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హతలు :
తెలంగాణ ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థికసాయం పొందాలంటే ఈ అర్హతలు కలిగివుండాలి.
1. తమ పేరిటగానీ లేదా తమ కుటుంబసభ్యుల పేరిటగానీ ఎలాంటి భూమిలేనివారు అర్హులు. అంటే భూముల వివరాలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించే ధరణి పోర్టల్ పేరు లేనివారు అర్హులు.
2. భూమి లేకుండా కూలీపనులు చేసుకునేవారికి ఈ ఆత్మీయ భరోసా ద్వారా ఆర్థికసాయం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.అందుకోసం ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగినవారినే ఈ ఆత్మీయ భరోసా అర్హులుగా తేల్చారు.
ఉపాధి హామీ కింద ఆ ఏడాది కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి. లేదంటే ఉపాధి కార్డు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అనర్హులు. వారి ఖాతాల్లో డబ్బులు పడవు.
3. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అందించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేసివుండాలి. ఇది తప్పనిసరి... ఇలా ఆధార్ లింక్ లేని బ్యాంక్ అకౌంట్స్ లో ఆత్మీయ భరోసా డబ్బులు పడవు.
4. ఇటీవల గ్రామసభలు నిర్వహించి ఈ అత్మీయ భరోసా లబ్దిదారుల జాబితాను విడుదల చేసారు. ఈ సమయంలో అభ్యంతరాలు వ్యక్తమైనవారికి కూడా ఆత్మీయ భరోసా డబ్బులు పడవు. ఎంపిడివో ఈ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది రైతు కూలీలకు లబ్ది జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరికి ఏడాదికి రూ.12,000 వేల చొప్పున ఆర్థిక సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ మహిళల అకౌంట్లో నెలనెలా ఫ్రీగా రూ.2,500 ... మార్చి 2025 నుండేనా?