బండి సంజయ్ వైఖరి: పవన్ కల్యాణ్ గుస్సా, రంగంలోకి బిజెపి పెద్దలు
జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరించిన తీరు పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరించిన తీరు పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు ప్రతిపాదన కూడా లేదని, నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ ను కలుస్తానని బండి సంజయ్ చెప్పారు. దానికితోడు, పవన్ కల్యాణ్ కు, తమకు మధ్య చిచ్చు పెట్టడానికి ఇతరేతర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు
చివరకు బండి సంజయ్ పవన్ కల్యాణ్ తో భేటీ కావాల్సి వచ్చింది. బండి సంజయ్ తీరుపై ఆగ్రహంతోనే తన పార్టీ అభ్యర్థులను పోటీకి దించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధపడ్డారు. శుక్రవారం ఉదయం ఆయన జనసేన అభ్యర్థులను ప్రకటించాలని అనుకున్నారు. దీంతో బిజెపి పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దినట్లు భావిస్తున్నారు. తమకు ఫిర్యాదులు అందడంతో వారు పవన్ కల్యాణ్ తో చర్చలు జరపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
వరద సాయం నిలిపేయాలంటూ బండి సంజయ్ ఈసీకి రాసినట్లు చెబుతున్న లేఖపై కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత అది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని భావించినప్పుడు ఈసీకి లేఖ రాయడంలో తప్పు లేదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
బండి సంజయ్ రాసిన లేఖ తనది కాదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బండి సంజయ్ చెబుతున్నారు. ఇది ఆయన సంతకమేనా, ఫోర్జరీ సంతకమా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి పోలీసులు దాన్ని పరీక్షించారు. ఆ లేఖ వల్ల వరద సాయం అగిపోయి ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్పందిస్తారని బహుశా భావించి ఉంటారు గానీ ప్రజలు అందుకు విరుద్ధంగా స్పందించారు. దాంతో బిజెపి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది
పరిస్థితిని గమనించిన బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి సిద్ధం కావాలని, ఆ లేఖ తాను రాయలేదని ప్రమాణం చేస్తానని బండి సంజయ్ ఈ రోజు ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అయితే, ఆయన వ్యూహాత్మకంగానే ఆ ఆలయాన్ని ఎఁచుకున్నట్లు భావిస్తున్నారు. అది తనకు అనుకూలంగా మారుతుందని బండి సంజయ్ భావించి ఉంటారు
బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడ్డారు
తమ ఆరేళ్ల పాలనలో హైదరాబాదులో ప్రశాంత వాతావరణం ఉందని, శాంతిభద్రతల పరిస్థితి సజావుగా ఉందని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కావాలనే ఎంచుకున్నారని, ప్రమాణం చేయాలనుకుంటే బిర్లా మందిర్ లేదా... ట్యాంక్ బంద్ మీడ ఆంజనేయ స్వామి ఆలయం లేదా అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చెప్పదలుచుకున్న విషయం ఏమిటో అందరికీ అర్థమయ్యేదే
పైగా, బండి సంజయ్ వ్యూహం ఫలించినట్లుగా కూడా లేదు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లేందుకు బండి సంజయ్ కు అనుమతి లేదని తొలుత చెప్పిన హైదరాబాదు పోలీసులు ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. దాంతో బండి సంజయ్ వ్యూహం బెడిసికొట్టింది. ఆయన ఆశించిన ఫలితం రాలేదు. ఆయన భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం అనేది ఓ సాధారణ విషయంగానే మారింది