టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ: రేవంత్ రెడ్డి టార్గెట్, కారణం ఇదే...
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త బాస్ ఎంపిక కోసం మాణికం ఠాగూర్ ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది.
టీపీసీసీకి కొత్త బాస్ ఎంపికపై పార్టీ నాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశావాహులు మళ్లీ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదే సమయంలో తమ వ్యతిరేకులకు ఈ పదవి దక్కకుండా ప్రయత్నిస్తున్నారు.
టీపీసీసీకి కొత్త నాయకత్వం ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరాడు. పీసీసీ చీఫ్ పదవికి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించిన ఠాగూర్ సోనియాగాంధీకి నివేదికను అందించనున్నారు.
అయితే తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు తాను కూడ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని ఆయన ప్రకటించారు.
పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు పీసీసీ చీఫ్ పదవి రాకూడదనే ఉద్దేశ్యంతోనే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు.
తనకు నచ్చిన వారు పీసీసీ చీఫ్ అయితే రాష్ట్రంలో పర్యటిస్తానని ఆయన తేల్చి చెప్పారు. లేకపోతే నియోజకవర్గానికే పరిమితం కానున్నట్టుగా చెప్పారు. జగ్గారెడ్డి కూడ రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన జైలుకు వెళ్తే ఎలా అని మరో నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ మొత్తం జైలు చుట్టూ తిరగాలా అని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని హనుమంతరావు బహిరంగంగానే డిమాండ్ చేశారు. రేవంత్ పై కేసులతో పాటు ఇతర అంశాలను కూడ ఆయన గతంలోనే లేవనెత్తారు.
ఈ విషయమై మాట్లాడినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం నేతలు మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టారు. తమకు ఈ పదవి దక్కకపోయినా సరే తమ ప్రత్యర్ధులకు ఈ పదవి రావొద్దనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.