భద్రమ్ సినిమా చూసి బీమా సొమ్ము కోసం హత్యలు: ఎవరీ రాజు?
ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు రాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మానవత్వాన్ని మర్చిపోయి కుటుంబసభ్యులే రాజుకు డబ్బుల కోసం సహకరించారు. ఈ కేసును మరింత లోతుగా నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొనేందుకు గాను బతికుండగానే చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే రాజు ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఐదుగురిని హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకొన్నారని పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలో కీలక పాత్రధారి రాజు ఓ సినిమాతో పాటు క్రైం సీరియల్స్ ను చూసి నేరం నుండి తప్పించుకొనేవాడని పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లాకు చెందిన రాజు ఇంటర్ ఫెయిలయ్యాడు. కానీ నేరాలు చేయడంలో ఆయన ఆరితేరాడు. ఉపాధి కోసం రాజు గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు. ఈ సంస్థలో పనిచేసే సమయంలోనే ఇన్సూరెన్స్ డబ్బులను ఎలా క్లైయిమ్ చేయాలో తెలుసుకొన్నాడు.
ప్రాణాంతక వ్యాధులతో మరణానికి దగ్గరగా ఉన్న వారిని గుర్తించి వారితో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించేవాడు.
పాలసీలు చేసినవారిని హత్య చేయించి పాలసీ డబ్బులను క్లైయిమ్ చేసుకొనేవాడు. ఈ విషయమై ముందే వారి కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొనేవాడు.చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకొని తన ఆలోచలను ఆయన అమలు చేసేవాడు.
2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ కి చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సక్రియా కుటుంబం రాజు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది.
అయితే సక్రియా బతికి ఉన్నట్టుగానే గ్రామ కార్యదర్శి సహాయంతో పత్రాలను సృష్టించాడు. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ సృష్టించి రూ. 1.4 లక్షల భీమా క్లెయిమ్ చేసుకొన్నాడు.
2014లో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిందితుడు రాజు తొలి హత్య చేశాడు. ఈ హత్యకు ముందుగా తమళ డబ్బింగ్ సినిమా భద్రమ్ సినిమా ద్వారా నిందితుడు ప్రేరణ పొందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఇన్సూరెన్స్ చేయించి అమాయకులను చంపి భీమా సొమ్ములను క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో చూపించారు.
యాక్సిడెంట్ డెత్ పాలసీ తీసుకొంటే... ఈ పాలసీ తీసుకొన్న మరునాడే మరణించినా పూర్తిస్థాయి డబ్బులు క్లెయిమ్ చేసుకొనే వీలుంది.
ఈ పాలసీలకు తక్కు ప్రీమియంతో ఎక్కువ రిస్క్ కవరేజీ ఉంటుంది. రక్త సంబంధీకులే ఈ డబ్బులను తీసుకొనేందుకు గాను అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబసభ్యులతో రాజు ముందుగానే ఒప్పందం చేసుకొనేవాడు.
రాజు ఇప్పటివరకు ఐదుగురిని హతమార్చి భీమా సొమ్మును తీసుకొన్నాడు. మరో రెండు శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు. మరో ఇద్దరిని కూడ చంపేందుకు కుట్ర చేశాడు. ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్సూరెన్స్ డబ్బుల క్లెయిమ్ ల విషయంలో వాస్తవాలను రాబట్టేందుకు గాను ఇన్సూరెన్స్ ఇన్మర్మేషన్ బ్యూరోకి నల్గొండ ఎస్పీ రంగనాథ్ లేఖ రాశాడు. గతంలో చోటు చేసుకొన్న కేసుల్లో పోలీసులు, వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు రాజు ప్లాన్ చేశాడు. ఈ విషయమై ఆయన భార్యను ఒప్పించాడు. కానీ ఈ ప్లాన్ 2021వరకు అమలు చేయలేకపోయాడు.
ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఈ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు రాజు.
అయితే వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రయత్నించి అరెస్టై రెండేళ్లపాటు జైల్లో ఉన్నాడు.
జైలు నుండి విడుదయ్యాక దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా లాక్ డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్య మరింత ఆలస్యమైంది.
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత లాక్డౌన్ పేరిట పలు ప్రైవేట్ కంపెనీల నుండి రూ, 1.20 కోట్ల ఇన్సూరెన్స్ లు తీసుకొన్నారు. ఇటీవలనే కోటిరెడ్డిని హత్య చేశారు.
రోడ్డు ప్రమాద కేసులు నమోదు చేసిన పోలీసులు ఏ అంశాలను రికార్డు చేశారనే విషయమై కూడ పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయనున్నారు.