ఒలింపిక్స్లో క్రికెట్ ఎందుకు లేదు? విశ్వక్రీడల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
టోక్యో ఒలింపిక్స్ 2020 విశ్వక్రీడలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ క్రీడా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచదేశాలన్నీ పాల్గొనే ఒలింపిక్ ఈవెంట్ల వెనకాల ఎన్నో శతాబ్దాల చరిత్రే ఉంది...
క్రీస్తు పూర్వం 8వ సెంచరీ నుంచే ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. గ్రీసులోని ఒలంపియా అనే నగరంలో నిర్వహించే క్రీడా పోటీలు కావడం వల్ల వీటికి ఒలింపిక్స్ అనే పేరు వచ్చింది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడాపోటీల కోసం యుద్ధాలను కూడా ఆపేవాళ్లు...
గ్రీకు దేవత జ్యూస్ గౌరవార్థం జరిగే ఈ ఒలింపిక్ పోటీల్లో గెలిచిన వారికి ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవాళ్లు. పరుగు పందెంతో పాటు కుస్తీ, గుర్రపు స్వారీ వంటి క్రీడాంశాల్లో పోటీలు జరిగేవి.
అయితే క్రీ.శ. 393లో రోమన్ చక్రవర్తి థియోడిసియస్, గ్రీకు సామ్రాజ్యాన్ని జయించడంతో ఒలింపిక్ క్రీడలకు బ్రేక్ పడింది. అప్పటిదాకా ఒలింపిక్ క్రీడలకు వేదిక నిచ్చిన ఒలింపియా నగరం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది...
ఫ్రెంచ్ అధ్యపకుడు, చరిత్రకారుడు ఫియరీ డీ కోబర్టీన్ కారణంగా దాదాపు 1400 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి ఒలింపిక్ క్రీడలు.
1892లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఏర్పాటుచేసిన కోబర్టీన్, విశ్వక్రీడలను తిరిగి ప్రారంభించేందుకు అమితమైన కృషి చేశాడు. అందుకే కోబర్టీన్ను ‘ఒలింపిక్ క్రీడల పితామహుడు’ అని పిలుస్తారు.
1896లో తిరిగి ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు, మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1940, 1944 సీజన్లలో రద్దు అయ్యాయి.
ఆధునిక ఒలింపిక్స్ క్రీడల్లో అనేక మార్పులు జరిగాయి. మంచు, ఐస్ స్పోర్ట్స్ జరిగే ఈవెంట్ల కోసం ‘వింటర్ ఒలింపిక్స్’ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అలాగే శారీరక వైకల్యం ఉన్నఅథ్లెట్ల కోసం ‘పారాలింపిక్స్’, టీనేజ్ వయసులో ఉన్నవారి కోసం యూత్ ఒలింపిక్ గేమ్స్ అంటూ ప్రత్యేకంగా తీసుకొచ్చారు.
ఐదు రంగులుంటే ఐదు చక్రాలను ఒలింపిక్ చిహ్నంగా వాడతారు. ఇందులో ఉండే ఐదు రింగులు ఐదు ఖండాలకు సూచిక కాగా, ఇందులో ఉండే ఒక్కో రంగుకి ఒక్కో అర్థం ఉంది.
క్రికెట్, కబడ్డీ వంటి క్రీడలకు మనదేశంలో బీభత్సమైన క్రేజ్ ఉన్నా ఒలింపిక్స్లో ఈ పోటీలు లేకపోవడానికి కారణం ఓ క్రీడ, ఒలింపిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే దాన్ని కనీసం నాలుగు ఖండాల్లో, 75 దేశాల్లో ఆడాలి. ఈ రెండు ఆటలకు అంత పాపులారిటీ లేదు.
కబడ్డీకి 1936 ఒలింపిక్స్లో చోటు దక్కింది. అయితే 49 దేశాలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఆసియాకే సొంతమైన కబడ్డీని కేవలం పరిచయ క్రీడగానే ఆడాల్సి వచ్చింది.
అలాగే 1900లో క్రికెట్ కూడా ఒలింపిక్ క్రీడల్లో భాగంగా ఉండేది. అయితే అప్పుడు ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడంతో ఆ తర్వాత దీన్ని కూడా తొలగించడం జరిగింది.