శని అమావాస్య నాడు ఈ పూజలు చేస్తే శని బాధలు తప్పుతాయి!
హిందూ సంస్కృతిలో శని అమావాస్యకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజున శని దేవుడిని పూజిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయట. సమస్యలన్నీ తొలగిపోతాయట. ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నవారు కొన్ని పనులు చేస్తే వారికి మంచి జరుగుతుందట. ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Shani Amavasya 2025:
శని అమావాస్య చాలా పవిత్రమైనది. ఆ రోజున శని దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ తిథిని ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ ఏడాది భాద్రపద అమావాస్య ఆగస్టు 22వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. శని అమావాస్య నాడు ఏలినాటి శని ఉన్నవారు ఎలాంటి పూజలు చేస్తే వారికి ఉపశమనం లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
శని అమావాస్య
జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. శని అమావాస్య శుక్రవారం ప్రారంభమై.. శనివారం ముగుస్తుంది. ఆ రోజున ఏలినాటి శనితో బాధపడుతున్న వారు కొన్ని ప్రత్యేకమైన శని పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. కొన్ని వస్తువులు దానం చేయడం కూడా వారికి మంచి చేస్తుందట.
పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి..
పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి శని అమావాస్య నాడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజున ఇంటికి దక్షిణ వైపున దీపాన్ని వెలిగిస్తే పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని నమ్మకం.
ఏలినాటి శనితో బాధపడేవారు
శని అమావాస్య నాడు ఏలినాటి శనితో బాధపడుతున్న వారు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయట. ముఖ్యంగా శని దేవుని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి.. 'శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చట.
ఏ వస్తువులు దానం ఇవ్వాలంటే?
శని అమావాస్య నాడు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, మినప పప్పు, ఇనుప వస్తువులను దానం చేయాలి. ఇలా చేస్తే శని దేవుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతోపాటు శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.