World Breast Feeding Week 2022: బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామ రక్ష ..
World Breast Feeding Week 2022: బిడ్డకు తల్లి పాలే బలం. తల్లిపాలతో ఎన్నో రోగాలు దూరమవుతాయి. అందుకే తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ బ్రెస్ట్ పీడింగ్ వీక్ గా జరుపుకుంటారు.

తల్లిపాలు, వీటివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేసేందుకే ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వ తేదీ వరకు తల్లిపాల దినోత్సవం లేదా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ను సెలబ్రేట్ చేస్తారు. World Alliance for Best Feeding Action, World Health Organization, United Nations Child Welfare Committee సహకారంతో భారతదేశంతో సహా 170 దేశాలు ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలను జరుపుకొంటున్నాయి.
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరం. ముర్రుపాలు పట్టించడం వల్ల బిడ్డ ఇమ్యూనిటీ పవర్ పెరుతుంది. ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకు తల్లికి మధ్య బంధాన్ని బలపరుస్తాయి. తల్లిపాలు తాగే పిల్లలు ఎంతో తెలివిగా, ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల దినోత్సవ థీమ్ 'కంటిన్యూయింగ్ బ్రెస్ట్ ఫీడింగ్: ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్'.
నవజాత శిశువులకు తల్లిపాలు ఉత్తమమైన ఆహారం. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ బాడీస్ ఎన్నో రకాల బాల్య వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాలొచ్చే ప్రమాదం తల్లులకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. అంతేకాదు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లుల్లో అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు.
తల్లి పాలే పిల్లలకు సంపూర్ణ ఆహారం. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. వీటినే ముర్రుపాలు అంటారు. ఈ పాలు పిల్లల్లో వ్యాధి పోరాట లక్షణాలను కలిగి ఉంటుంది. తల్లి పాల ద్వారా బిడ్డకు అవసరమైన విటమిన్ ఎ, ప్రోటీన్ లభిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. తల్లులు పిల్లలకు పాలివ్వడం వల్ల ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ తో 20,000 ప్రసూతి మరణాలు తగ్గుతున్నాయట.
బిడ్డ ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తల్లిపాలు పట్టడం లేదట. పిల్లలకు పుట్టిన ఆరు నెలలు మాత్రమే తల్లిపాలు అవసరం అవుతాయి. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల నవజాత శిశువులలో పేగు వ్యాధులు, న్యుమోనియా, దంత వ్యాధులు, చెవి సంక్రామ్యతలు దూరమవుతాయి. తల్లిపాలు పిల్లల మెదడు, శారీరక ఎదుగుదలకు అవసరం అవుతాయి.
ఆరు నెలల తరువాత.. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంతో పాటుగా ఉడికించిన అరటి పండు, రాగి పెరుగు వంటివి ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ ను అలవాటు చేయాలి. బిడ్డ ఎదిగే కొద్దీ ఆహారం పరిమాణాన్ని పెంచుతూ ఉండాలి. తల్లిపాలు తీసుకోకపోవడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, తక్కువ బరువు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు ఇవ్వడం వల్ల ప్రసవానంతర రక్తస్రావం అయ్యే ప్రమాదం తగ్గుతుంది.