డైరెక్ట్ చేయమంటే ప్రేమలో పడేశారు .. హీరోయిన్లని మ్యారేజ్ చేసుకున్న దర్శకులు
ఓ సినిమాకి కెప్టెన్ దర్శకుడు. ఆ సినిమా, దాని కథ దర్శకుడు ఆలోచనల నుంచి పుట్టింది. హీరో పాత్రైనా, హీరోయిన్ పాత్రైనా దర్శకుడి ఊహల్లోని పుట్టిందే. ఓ మహిళా పాత్రని ఎంత అందంగా ఊహించుకుంటే హీరోయిన్లో అంత అందంగా చూసుకుంటాడు. అలానే తెరపై ఆవిష్కరిస్తారు.
అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతుంది. దర్శకుడు ఊహకు నిజమైన హీరోయిన్ కొన్ని సార్లు ఫిదా అవుతుంది. అదే సమయంలో తాను అనుకున్న ఊహని హీరోయిన్ అచ్చు గుద్దేసిందనుకోండి ఆ హీరోయిన్పై దర్శకుడు ఆకర్షితుడవుతారు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడటం సహజమే. అయితే హీరోయిన్లని డైరెక్ట్ చేయమంటే ఏకంగా పెళ్ళిళ్లు చేసుకున్న ఘనత మన స్టార్ డైరెక్టర్లకే దక్కుతుంది. మరి హీరోయిన్లని తమ బుట్టలో పడేసి మ్యారేజ్ చేసుకున్న సౌత్ డైరెక్టర్స్ ఎవరో ఓ సారి చూద్దాం.
ముందుగా చెప్పాలంటే శోభ-బాలు మహేంద్రల గురించి చెప్పుకోవాలి. బాలు మహేంద్ర రూపొందించిన చాలా సినిమాల్లో శోభ హీరోయిన్గా నటించింది. `కోకిల`లో శోభనే హీరోయిన్. ఆ సమయంలోనే ఇద్దరు మనసు పడ్డారు. పెళ్ళి చేసుకున్నారు. ఆ వెంటనే శోభ ఆత్మహత్యకు పాల్పడింది. అదో విషాద గాథగా మిగిలింది.
హీరోయిన్, దర్శకుడు పెళ్ళి చేసుకున్న వారిలో మణిరత్నం, సుహాసినల గురించి ప్రత్యేకంగా చెప్పొకోవాలి. సుహాసిని.. మణిరత్నం రూపొందించిన సినిమాల్లో నటించలేదుగానీ, ఆయన వద్ద అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చేసింది. అలా ఇద్దరు ప్రేమలో పడి 1988లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి నందన్ అనే కుమారుడు ఉన్నారు.
దర్శకుడు భాగ్యరాజ్ అనేక సూపర్ హిట్ సినిమాలు చేశారు. కానీ `డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్` సినిమాలో పూర్ణిమతో కలిసి భాగ్యరాజ్ నటించారు. అంతే ఇద్దరు ప్రేమించుకున్నారు. 1984లోనే మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.
దర్శకుడు ప్రతాప్ పోతన్.. రాధిక హీరోయిన్గా `మీందుమ్ ఓరు కాతల్ కథై` చిత్రంలో నటించారు. ఆ సినిమా టైమ్లోనే వీరి మనసులు కలిశాయి. 1985లో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. తర్వాత రాధిక.. నటుడు శరత్ కుమార్ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రేమలో పడింది రమ్యకృష్ణ. కృష్ణవంశీ రూపొందించిన `చంద్రలేఖ` చిత్రంలో రమ్యకృష్ణ హీరోయిన్. ఆ సమయంలో ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. 2003లో పెల్ళి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు.
తెలుగు హీరోయిన్ రోజాని దర్శకుడు ఆర్.కె సెల్వమణి 1992లో `చెంబరుథి`చిత్రంతో తమిళంలోకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరికి జోడీ కుదిరింది. పదేళ్ళ తర్వాత పెళ్ళితో ఒక్కటైపోయారు. వీరికి కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
అగ్ర నటి రేవతి సైతం దర్శకుడు సురేష్ చంద్రకి ఫిదా అయ్యింది. 1986లో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరికి పడలేదు. కొన్నాళ్ళు సహజీవనం చేశారు. ఆ తర్వాత విడిపోయారు.
అందాల నటి సీత సైతం దర్శకుడు పార్థిబన్కి ఆకర్షితురాలైంది. పార్థిబన్ రూపొందించిన `పుథియా పాధై` చిత్రంలో సీత నటించారు. ఆయనకు సీత ఇంప్రెస్ అయ్యింది. మెడలో 1990లో మూడు ముళ్ళు వేయించుకుంది. 2001లో వీరు విడిపోయారు.వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక దత్తత తీసుకున్న కుమారుడు ఉన్నారు.
శరణ్య, పొన్నవనన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అలాగే పొన్నవనన్ రూపొందించిన సినిమాల్లో కూడా నటించింది. అంతే ఇద్దరు కలిసిపోయారు. 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
ఖుష్బు, సుందర్ సి కలిసి సినిమాలు చేయలేదు. కానీ నిర్మాతగా ఉన్నప్పుడే సుందర్ సి ని ప్రేమించింది ఖుష్బు. 2000లో పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ళున్నారు.
దేవయాని.. దర్శకుడు రాజ్ కుమారన్ 1999లో రూపొందించిన `నీ వరువై ఎన్నా` చిత్రంలో నటించింది. అప్పుడే ఆయనకు ఇంప్రెస్ అయ్యింది. 2001లో అందరికి షాక్ ఇస్తూ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు డాటర్స్ ఉన్నారు.
మాస్ చిత్రాల దర్శకుడు హరి మొత్తంగా క్యూట్ హీరోయిన్ ప్రీతిని పడేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే హరికి ప్రీతి పడిపోయింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు.
దర్శకుడు సెల్వరాఘవన్కి, హీరోయిన్ సోనియా అగర్వాల్కి `కాదల్ కొండీన్` చిత్ర సమయంలో పరియం ఏర్పడింది. ఈ రొమాంటిక్ చిత్రానికే కాదు, సెల్వరాఘవన్లోని రొమాంటిక్ మనసుకి కూడా సోనియా ఫిదా అయ్యింది. అంతే వీరిద్దరు 2006లో మ్యారేజ్ చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.
దర్శకుడు సూర్య కిరణ్, నటి కళ్యాణి సైతం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు.
నేటితరంలో ప్రేమలో పడ్డవారిలో అమలాపాల్, ఏ ఎల్ విజయ్ ఉన్నారు. విజయ్ రూపొందించిన `తలైవా` లో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. 2014లో మ్యారేజ్ చేసుకున్నారు. మూడేళ్లకే విడిపోయారు.