అప్పుడు చావు భయం వెంటాడింది...వాళ్ళ కామెంట్స్ కృంగదీశాయి
ఆమధ్య మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకొని తమన్నా కోలుకున్నారు.కరోనా సోకిన సమయంలో తమన్నా ఎదుర్కొన్న మానసిక వేదన గురించి తెలియజేసింది.
కోవిడ్ అని తెలియగానే తమన్నా చాలా భయపడ్డారట. చికిత్స సమయంలో చనిపోతానని అనిపించిందట. కరోనాకు సంబంధించిన జ్వరం, దగ్గు వంటి లక్షణాలు తీవ్రంగా కనిపించడంతో ఏమవుతుందో అని తమన్నా మానసికంగా వేదన చెందారట.
మెరుగైన వైద్యం అందించి డాక్టర్స్ తనను కాపాడినట్లు తమన్నా తెలియజేయడంతో పాటు వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక కరోనా సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు తమన్నా ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వ్యాధి తనకు జీవితం విలువేమిటో తెలియజేసిందని తమన్నా చెప్పడం విశేషం. కాగా కరోనా చికిత్స కోసం మెడిసిన్ తీసుకోవడం వలన కొంచెం లావుగా తయారయ్యాను. కోవిడ్ చికిత్స తరువాత నా ఫోటో సోషల్ మీడియాలో పంచుకోగా కొందరు కామెంట్స్ చేశారని తమన్నా బాధపడ్డారు.
నువ్వు లావుగా తయారయ్యావ్ అని కొందరు కామెంట్ చేయడంతో తమన్నా ఇబ్బందిపడ్డారట. అసలు నిజం తెలుసుకోకుండా లోపాలు వెతుకుతూ జనాలు ఆనందిస్తారని అప్పుడు తనకు అర్థం అయ్యిందని తమన్నా వాపోయారు.
ఫిట్నెస్ పై అత్యంత శ్రద్ద కనబరిచే తమన్నా కోవిడ్ తరువాత ప్రాపర్ వ్యాయామంతో పూర్వపు స్థితికి రావడం జరిగింది. ప్రస్తుతం తమన్నా అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
సంపత్ నంది దర్శకత్వంలో గోపి చంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ మూవీలో తమన్నా కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కనున్న అంధాదున్ తెలుగు రీమేక్ లో తమన్నా ఓ బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు.
సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం మూవీలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయ్యారు.