ప్రైవేట్ జెట్లో ఇంటికి చేరుకున్న రజనీ.. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి..
సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంలో ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్ దర్శకుడు. నయనతార, కీర్తిసురేష్, జగపతిబాబు, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఇటీవల తిరిగి షూటింగ్ని ప్రారంభించారు. ఇందులో రజనీ, నయనతార, జగపతిబాబు ఇలా ప్రధాన తారాగణం పాల్గొంది. రజనీ, జగపతిబాబుపై పలు యాక్షన్ సీన్స్, అలాగే నయనతార, రజనీల మధ్య పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. దాదాపు 35 రోజులుగా ఈ హైదరాబాద్ షెడ్యూల్ జరిగింది.
ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అస్వస్థతకి గురైన విషయం తెలిసిందే. సెట్లో కొంత మందికి కరోనా సోకడంతో షూటింగ్ని నిలిపివేశారు. ఆ తర్వాత చాలా రోజుల గ్యాప్తో తిరిగి ఇటీవల ప్రారంభించి హైదరాబాద్ షెడ్యూల్ని పూర్తి చేశారు.
మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్ సంస్థ నిర్మిస్తుంది. దీపావళి సందర్బంగా సినిమాని విడుదల చేయబోతున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రైవేట్ జెట్లో చెన్నై వెళ్లిన రజనీ నేరుగా ఇంటికెళ్లారు. ఇంటి వద్ద ఆయన భార్య లతా రజనీకాంత్ ఆయనకు హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానించింది.
ఇక రజనీ ఇంటికి చేరుకున్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు చాలా మంది ఇంటికి చేరుకున్నారు. వారందరికి రజనీ అభివాదం చేయడం విశేషం.