వారణాసి మూవీ పేరు మార్పు, కొత్త టైటిల్ ఇదే.. రెండు పార్ట్ లపై అప్ డేట్
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న `వారణాసి` మూవీ టైటిల్ మారిపోయింది. ఆ మధ్య పేరు విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో టైటిల్ని మార్చేశారు.

మొదటిసారి రాజమౌళి, మహేష్ కాంబోలో మూవీ
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మొదటిసారి సినిమా వస్తోంది. `వారణాసి` పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు జక్కన్న. సుమారు రూ. 1300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. వెయ్యి కోట్లు అనుకున్నా, బడ్జెట్ పెరిగిపోతుందన్నారు. ఇందులో మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపించబోతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందన్నారు.
టైమ్ ట్రావెల్ కథతో `వారణాసి`
ఇటీవల `వారణాసి` టైటిల్ని రివీల్ చేసే క్రమంలో విడుదల చేసిన ట్రైలర్లో ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, దాదాపు నాలుగైదు కాలాల్లో హీరో ప్రయాణిస్తాడని తెలియజేశారు. రామాయణంలోని లంకదాహణం అనే ఘట్టాన్ని మెయిన్గా చేసుకుని మూవీని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ని చూస్తే తెలుస్తోంది. ఇందులో రాముడిగానూ మహేష్ కనిపించబోతున్నట్టు రాజమౌళి తెలిపారు. ఆయన్ని చూసి తనకే గూస్ బంమ్స్ వచ్చాయని, రేపు తెరపై ఆడియెన్స్ వాహ్ ఫీలవుతారని తెలిపారు. ఈ టైటిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అదే సమయంలో మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని, విజువల్ వండర్గా ఉండబోతుందని తెలుస్తోంది.
`వారణాసి` టైటిల్ వివాదం
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రామభక్త హనుమ నిర్మాణ సంస్థ `వారణాసి` అనే టైటిల్ని ఫిల్మ్ ఛాంబర్లో ముందుగానే రిజిస్టర్ చేయించింది. అంతేకాదు ఈ టైటిల్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఆ తర్వాత రాజమౌళి కూడా తన సినిమా పేరుని `వారణాసి`గా ప్రకటించారు. దీంతో వివాదం నెలకొంది. సదరు నిర్మాతలు పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇది వివాదంగా మారిన నేపథ్యంలో ఆ గొడవకు తెరతీస్తూ పేరుని మార్చారు రాజమౌళి.
`వారణాసి` కొత్త టైటిల్ ఇదేనా?
ఇక మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న `వారణాసి` పేరుని కాస్త `రాజమౌళి వారణాసి`గా మారుస్తున్నారట. తెలుగులో ఈ పేరుతోనే విడుదల చేయబోతున్నారు. మిగిలిన భాషల్లో ఈ టైటిల్కి సమస్య లేదు. తెలుగు టైటిల్కి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూవీని రెండు పార్ట్ లుగా రాజమౌళి తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని, ఒకే పార్ట్ లోనే సినిమాని పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2027 సమ్మర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

