సింహం ముందు గొడ్డలితో మహేష్ బాబు, వరుస ఫోటోలు లీక్.. అసలేం జరుగుతోంది ?
ఎస్ఎస్ఎంబీ29 ఆఫ్రికా షెడ్యూల్ నుంచి మహేష్ బాబు కొత్త ఫోటోలు లీక్ అయ్యాయి. రాజమౌళి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అభిమానులు సూచిస్తున్నారు.

మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ29 మరోసారి లీక్ల బారిన పడింది. భారీ భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, కెన్యా షెడ్యూల్లో కొన్ని షూటింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
లీకైన ఫొటోలో మహేష్ బాబు ఒక రగ్గడ్ లుక్లో కనిపిస్తున్నారు. ఆయన ఒలివ్ గ్రీన్ ఫుల్ స్లీవ్ టీ-షర్ట్, జీన్స్ ధరించి, యాక్షన్ సీక్వెన్స్లో భాగమై ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆ స్టిల్ ప్రకారం, కెన్యా దేశంలోని విస్తారమైన పచ్చిక బయళ్ల మధ్య షూట్ జరుగుతోందని అర్థమవుతోంది.
ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్లో జరిగిన అవుట్డోర్ షెడ్యూల్లోనూ లీకులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో మహేష్ బాబు, విలన్ పాత్రధారి పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇద్దరూ కనిపించిన ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. ఆ ఘటనల తర్వాత రాజమౌళి టీం భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.
అయితే తాజా లీక్తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సినిమాపై ఉన్న సస్పెన్స్, హైప్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. లీకైన ఫొటోల్లో మహేష్ బాబు గొడ్డలి పట్టుకుని సింహం ముందు నిలబడి ఉన్నారు. అక్కడే ఒక మినీ ప్లేన్ కూడా ఉంది.
ఎస్ఎస్ఎంబీ29 రూ.1,200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్-ఇంటర్నేషనల్ జంగిల్ అడ్వెంచర్గా చెప్పబడుతోంది. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా రాజమౌళి పర్యవేక్షణలో ఇలాంటి లీకులు జరగవు. కానీ ఈ సారి ఆయన జట్టు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.సినిమా వివరాలు, కథాంశం గోప్యంగా ఉంచిన ఈ సమయంలో లీకులు బయటపడటం అభిమానుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.