హాట్ టాపిక్: దిల్ రాజుకు అల్లు అర్జున్ డబుల్ షాక్
సిని పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏ క్షణానికి మిత్రులు అవుతారో, శత్రువులు అవుతారో అసలు ఊహించలేము. అయితే అదే సమయంలో శాశ్వత శతృత్వమూ, మితృత్వమూ ఉండదనే విషయమూ కూడా గుర్తుంచుకోవాలి. తాజాగా అల్లు అర్జున్, దిల్ రాజు గురించిన హాట్ టాపిక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అల్లు అర్జున్ తన స్నేహితుడుగా చెప్పబడే దిల్ రాజుకు రెండో సార్లు షాక్ ఇచ్చాడంటున్నారు.
దిల్ రాజుకు, అల్లు అర్జున్ కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. వీరిద్దరి కాంబినేన్ లో ఆర్య, పరుగు, ఎవడు, డీజే వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ మధ్యన వీరిద్దరి మధ్యన గ్యాప్ కూడా వచ్చిందని మీడియా లో వార్తలు వచ్చాయి.
అల వైకుంఠపురములో సినిమాలో మంచి లాభాలు వచ్చినప్పటికి దానిని తన మూవీగా భావించలేదు దిల్ రాజు. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్లో కూడా అల వైకుంఠపురములో వేరే సినిమా అన్నట్టు, సరిలేరు తన సినిమా అన్నట్టు దిల్ రాజు వ్యవహరించాడు.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రిలీజ్ క్లాష్లో దిల్ రాజు ఎక్కువగా మహేష్ తరఫునే వుండడం, అతని సినిమాకి ఎక్కువ కలక్షన్లు చూపించడం లాంటివి అల్లు అర్జున్కి అసలు నచ్చలేదు. వీటిన్నటి ప్రభావం దిల్ రాజుతో చేయబోయే ఐకాన్ సినిమాపై పడిందా అనే సందేహాలు మీడియాలో మొదలయ్యాయి. ఎందుకంటే ‘అల వైకుంఠపురములో’ తదుపరి సినిమాగా ఐకాన్ చేస్తాడని అనుకున్నారు.
కానీ సుకుమార్ సీన్ లోకి వచ్చి ఊహించని విధంగా పుష్ప సినిమా మొదలెట్టారు. ఇది దిల్ రాజు ఊహించని పరిణామం. ఆ సినిమా తర్వాత అయినా తన ఐకాన్ ని పట్టాలు ఎక్కిస్తాడేమో అని దిల్ రాజు లెక్కలేసారు. కానీ అదీ జరగలేదు. కొరటాల శివ సీన్ లోకి వచ్చారు. కొత్త సినిమాకు సంభందించిన ప్రకటన వచ్చేసింది. రెండు సార్లు దిల్ రాజు కు షాక్ తగినట్లైంది.
తను చెప్పించిన స్క్రిప్టు నచ్చలేదా లేదా తన దర్శకుడు నచ్చలేదా అవన్ని కాకుండా తనతో ముందుకు వెళ్లటం అల్లు అర్జున్ కు ఇష్టం లేకే ఇలా వరస ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాడా అని ఆలోచనలో పడ్డారట. ఈ మేరకు అల్లు అర్జున్ టీమ్ ని టచ్ చేసినా ఎవరూ సమాధానం ఇచ్చేలా లేరట.
వాస్తవానికి అల వైకుంఠపురములో రిలీజ్ కాకముందు బన్నీతో ’ఐకాన్’ మూవీని దిల్ రాజు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ఉంటుందని చెప్పాడు. అంతేకాదు ఈ కథ విన్న అల్లు అర్జున్ ఈ సినిమా కచ్చితంగా చేస్తానని చెప్పాడు.
సుకుమార్ సినిమా కంటే ముందు ఐకాన్ మొదలు అవుతుందని కూడా చెప్పాడు. అయితే ఆ చిత్రం చేయాలంటే ‘అల వైకుంఠపురములో’ మాదిరిగా గీతా ఆర్ట్స్ని భాగస్వామిగా పెట్టుకోవాలని అల్లు అర్జున్ చెప్పాడట. అది దిల్ రాజు కు ఇష్టం లేదట అనే టాక్ కూడా మరో ప్రక్క నడుస్తోంది.
ఏది ఎలా ఉన్నా ఇప్పుడు దిల్ రాజుతో అల్లు అర్జున్ సినిమా ప్రారంభం అవుతుందా లేదా అనేదే ప్రశ్న. అయితే పుష్ప, కొరటాల శివతో చేయబోయే సినిమాలు పూర్తై రిలీజ్ అయ్యేసరికి వచ్చే సంవత్సరం పూర్తవుతుంది. అంటే దిల్ రాజుతో సినిమా చేయాలంటే 2022 దాకా వెయిట్ చెయ్యాల్సిందే. అప్పటికి ఎన్ని మార్పులు వస్తాయో వేచి చూడాలి.