ఆ బాధ చూడలేక మా అమ్మాయిని చంపేయాలనుకున్నాః పావలా శ్యామల ఆవేదన
నటి పావలా శ్యామల షాకింగ్ కామెంట్ చేశారు. తన కూతురి బాధని చూడలేక, ఆమె అన్నం పెట్టలేక తానే చంపేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పావలా శ్యామలా ఈ విషయాలను వెల్లడించి దిగ్ర్భాంతికి గురి చేసింది.
పావల శ్యామల తెలుగులో నటిగా ఎంతటి పేరు తెచ్చుకుందో తెలిసిందే. గయ్యాలి తరహా పాత్రలతో ఆమె వెండితెరపై తనదైన ప్రత్యేకతని చాటుకుంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, పేదింటి మహిళగా, మంచి హాస్య నటిగా నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
ఇటీవల తన కుటుంబ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని వాపోయిన విషయం తెలిసిందే. తాను పుట్టెడు కష్టాల్లో ఉన్నానని, తన కూతురు ఆరోగ్యం బాగా లేదని వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి రెండు లక్షలు సహాయం అందజేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకుంది. `మా అమ్మాయి(మాధవి)కి రెండేళ్ల క్రితం టీబీ వ్యాధి వచ్చినప్పుడు నాకు చేతనైనంత వరకు మందులు ఇప్పించాను. అప్పుడు చిరంజీవిగారు వాళ్ల అమ్మాయితో రెండు లక్షలు పంపించారు. మంచి డాక్టర్కి చూపించి, మంచి మందులు వాడాం. టీబీ వ్యాధి నయం అయిపోయింది. అయితే ఉన్నట్టుండి ఈ మధ్య కిందపడిపోయింది. డాక్టరు వద్దకు తీసుకెళితే మూడు చోట్ల కాలు ఎముకలు విరిగాయి.. రాడ్లు వేయ్యాలని, అందుకు దాదాపు మూడు లక్షలు ఖర్చవుతుందన్నారు.
ఆపరేషన్ చేయించకుంటే కాలు తీసేయాల్సి వస్తుందంటే ఆస్పత్రిలో చేర్పించాను. బిల్లు దాదాపు 4లక్షలయింది. బిల్లులో కొంత మొత్తం తగ్గించాక రూ.80 వేలు తక్కువ ఉండటంతో `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్` (మా) చెల్లించింది. రెండు నెలలు ఫిజియోథెరపీ చేస్తే కాలు బాగవుతుందని చెప్పారు. ఫిజియోథెరపీ మొదలుపెట్టాక, ఆ డాక్టరుకే దాదాపు లక్ష రూపాయలు ఫీజు చెల్లించాం. ఇక డబ్బులు చెల్లించలేమని డాక్టర్ని రావద్దని చెప్పాను. కానీ అమ్మాయి పడుతున్న బాధని మాటల్లో చెప్పలేను. దానికి బలమైన ఆహారం పెట్టలేక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేశాను. కానీ తల్లిని కదా.. ఆ పని చేయలేకపోయా` అని తెలిపింది.
ఇంకా చెబుతూ, `ఈ విషయం తెలుసుకున్న చిరంజీవిగారు `మా` సభ్యత్వం రుసుము చెల్లించారు. నేను చనిపోయినా `మా` మెంబర్ని కాబట్టి అందరూ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. ఇది ఆయన పుణ్యమే. కానీ ఇంకా మేము అనుభవించాల్సిన అవమానం, నరకం చాలా ఉంది. నా బాధ ఎవరి మనసుల్ని అయినా కదిలిస్తే దయచేసి జాలి పడండి. కానీ అవమానించకండి. సహాయపడమని ప్రాధేయపడుతున్నా` అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పావలా శ్యామల చిరంజీవి `ఛాలెంజ్` నుంచి ఇటీవల వచ్చిన `నేను లోకల్`, `మత్తు వదలరా` వరకు అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రలు పోషించి మెప్పించింది.