వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్టు ఆ నేపధ్యమా? మెగా ఫ్యాన్స్ లో టెన్షన్
ప్రయోగాల బాట పట్టిన ప్రతిసారి ఫలితం డిజాస్టర్ క్రిందే ఉంటూ వస్తోంది. రీసెంట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆపరేషన్ వాలంటైన్ కూడా అదే పరిస్థితి.
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరణ్ తేజ్ కటౌట్ బాగుంటాడు. కథలో వైవిధ్యం చూసుకుని సినిమాలు చేస్తూంటాడు. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం ఉండాలని ఆశిస్తాడు. అయితే ఈ మెగా హీరో కు ఎక్స్పర్మెంట్స్ పెద్దగా వర్కవుట్ అవ్వటం లేదు. కానీ అతను మాత్రం ప్రయోగాలు చేయడం ఆపరు. అందులో వరుణ్ తేజ్ అందరికంటే ముందుంటాడు. కెరీర్ మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ చూపులన్నీ ప్రయోగాలపైనే ఉన్నాయి. తాజాగా మరో ప్రయోగం లాంటి కథకు ఓకే చెప్పారనే వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ కాన్సెప్టు వినగానే మెగా ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
మెగా కుటుంబం నుంచి వచ్చినా కూడా వరుణ్ తేజ్ వాళ్ల రూట్లో కమర్షియల్ సినిమాలనే నమ్ముకోకుండా కొత్త దారిలో వెళ్తున్నాడు వరుణ్ తేజ్. దాంతో ఇంకా మాస్ ఇమేజ్కు దూరంగా ఉన్నాడు ఈ హీరో. మధ్య మధ్యలో కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వరుణ్ తేజ్కు మంచి హిట్స్ వచ్చాయి.. పైగా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. అలా కాకుండా ఆయన ప్రయోగాల బాట పట్టిన ప్రతిసారి ఫలితం డిజాస్టర్ క్రిందే ఉంటూ వస్తోంది.
రీసెంట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆపరేషన్ వాలంటైన్ కూడా అదే పరిస్థితి. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఊహించినంతగా రాలేదు. తొలిరోజు అయితే మరీ దారుణంగా 2 కోట్ల ఓపెనింగ్ మాత్రమే వచ్చింది. చివరకు సినిమా డిజాస్టర్ అన్నారు.
ఇక 'టచ్ చేసి చూడు' ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని సమాచారం. కథ కొత్తగా ఉంటుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వినికిడి.
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఏఐ తో సమాజంలోని అన్ని రంగాలను ఎంతగానో ప్రభావితం అవుతున్నాయి. నేపథ్యంలో ఏఐ సాంకేతికత ప్రధానంగా తెలుగులో ఓ లవ్స్టోరీ అంటే ఖచ్చితంగా యూత్ కు నచ్చుతుందని బావిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, కాన్సెప్ట్లో కొత్తదనం నచ్చడంతో వరుణ్తేజ్ ఈ సినిమాకు గ్రీన్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.
అయితే అదే సమయంలో ఇలాంటి సినిమాలకు మల్టిఫ్లెక్స్ లకే పరిమితం అవుతాయని, శంకర్ రోబో స్దాయిలో తీస్తేనే మాస్ లోకి వెళ్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే . ప్రస్తుతం వరుణ్తేజ్ ‘మట్కా’ చిత్రంలో నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఏదైమైనా వరుణ్ తేజ్ ప్రయోగాలు కాకుండా కమర్షియల్ సినిమాలు చేసినపుడు ఓపెనింగ్స్, కలెక్షన్స్ అదిరిపోయాయి. ఆరేళ్ల కింద తొలిప్రేమ సినిమాకు మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ వచ్చింది.. దాని తర్వాత గద్దలకొండ గణేష్ సినిమాకు ఫస్ట్ డే 11 కోట్ల గ్రాస్ వచ్చింది. మిస్టర్ సినిమాకు కూడా 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ అంతరిక్షం, కంచె, గాంఢీవదారి అర్జున, గని లాంటి సినిమాలు మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. ఫుల్ రన్లోనూ వీటి పరిస్థితి మారలేదు. దాంతో ఇప్పుడు మరో ప్రయాగాత్మక చిత్రంఅంటే ప్యాన్స్ కంగారుపడటంలో వింతేముంది.
అర్జెంట్ గా వరుణ్ తేజ ఇప్పటికిప్పుడు ఎక్స్పర్మెంట్స్ మానేసి.. కమర్షియల్ సినిమాలు చేస్తే గానీ కెరీర్ సెట్ అవ్వదనే ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ఎఫ్ 2, ఫిదా, ఎఫ్ 3, తొలిప్రేమ లాంటి విజయాలన్నీ ఆయన సేఫ్ జోన్లో చేసినప్పుడు వచ్చినవే. అందుకే హాయిగా ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టి.. అవే చేయాలని అభిమానులు కూడా చెబుతున్నారు. దానికి తోడు రవితేజ తో చేసిన టచ్ చేసి చూడు చిత్రం డిజాస్టర్ అవటం కూడా ఈ సినిమా ప్రారంభం కాకుండా ఇలాంటి కామెంట్స్ వినపడటానికి కారణం అవుతోంది.