సెలబ్రిటీలకు మహేష్ దివాళి సర్ప్రైజ్లు.. ఉబ్బితబ్బిబ్బవుతున్న స్టార్స్!
చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు మహేష్బాబు సర్ప్రైజ్ ఇచ్చాడు. దీపావళి పండుగని పురస్కరించుకుని వారికి గిఫ్ట్ లు పంపించి షాక్కి గురి చేశారు. ఓ సూపర్ స్టార్ నుంచి గిఫ్ట్ లు వస్తే, అది ఊహించని విధంగా వస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. ఇప్పుడు మహేష్ నుంచి బహుమతులు పొందిన వారంతా అలాంటి ఆనందంతో కూడిన షాక్లో ఉన్నారు.
దీపావళి పండుని పురస్కరించుకుని తన అభిమానులకు, ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. `వెలుగునిచ్చే ప్రేమ, ఆశ, సంతోషాన్ని అందరికీ పంచుదాం. కాలుష్యం నుంచి మనల్ని, మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది` అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన కొత్తఫోటోని పంచుకున్నారు. అంతటితో ఆగలేదు. సినీ ప్రముఖులకు గిఫ్ట్ లు అందించారు.
అందులో మొదటగా దర్శకుడు పరశురామ్ని సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఆయనతో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. దివాళీ కానుకగా తన దర్శకుడు పరశురామ్కు గిఫ్ట్ పంపించాడు మహేష్ బాబు. అది చూసుకుని పరశురామ్ మురిసిపోతున్నాడు.
ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు తనకు ఏ హీరో ఇలాంటి గిఫ్ట్స్ పంపలేదని చెబుతూ, పరశురామ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. `నిజంగా మీరు సూపర్ సర్` అంటూ సూపర్ స్టార్ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు పరశురామ్.
ఒక్క పరశురామ్కే కాదు మరో దర్శకుడు గుణశేఖర్కి కూడా గిఫ్ట్ పంపించాడు. దీంతోపాటు అడవిశేషు, సంగీత దర్శకుడు తమన్, హీరో వరుణ్ తేజ్ లకు కూడా దివాళి బహుమతులు పంపి సర్ప్రైజ్ చేశారు. మహేష్ నుంచి వచ్చిన ఈ సర్ప్రైజ్లు చూసుకుని వీరంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. ఇటీవల తమ ఫ్యామిలీతో కలిసి అమెరికా చెక్కేశాడు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో హాలీడేస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తిరిగి వచ్చి ఈ నెల చివర్లో `సర్కారు వారి పాట` చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతున్న విషయం తెలిసిందే.