నేను నిజాయితీగా ఉంటా.. అందుకే అందరికి వ్యతిరేకిగా మారాః కంగనా భావోద్వేగం
ఇటీవల బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్న కంగనా రనౌత్ ఎమోషనల్ అయ్యింది. తనకు పరిశ్రమలో ఎదురవుతున్న ఒడిదుడుకులు, అండదండలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, పలు విషయాలను వెల్లడించింది. తనకు వ్యతిరేకంగానే చాలా మంది వ్యవహరిస్తారని చెప్పింది.
నేను పరిశ్రమలో చాలా నిజాయితీగా ఉంటాను. మాట్లాడే విధానం కూడా అలానే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు. నేను రిజర్వేషన్లని వ్యతిరేకించాను, చాలా మంది హిందువులు నన్ను ద్వేషించారు. `మణికర్ణిక` సినిమా విడుదల సమయంలో కర్ణి సేనతో పోరాడాను. అప్పుడు రాజ్పుత్లు నన్ను బెదిరించారు.
నేను ఇస్లాం వాదాలను వ్యతిరేకిస్తున్నాను. అందుకే చాలా మంది ముస్లింలు నన్ను వ్యతిరేకిస్తున్నారు. నేను ఖలిస్తానీలతో పోరాడాను, కాబట్టి చాలా మంది సిక్కులు నాకు వ్యతిరేకంగా మారిపోయార`ని తెలిపింది.
నాలాంటి వారిని ఓ రాజకీయ పార్టీ కూడా మెచ్చుకోదు. అసలు నేనే చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానని మీలో చాలా మంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. కానీ ఈ ప్రపంచాన్ని మించిన నా ప్రపంచంలో నా మనస్సాక్షి నన్ను ప్రశంసిస్తూనే ఉంటుందని పేర్కొంది కంగనా.
కంగనా నెపోటిజంపై ఎప్పుడూ గొంతు విప్పుతూనే ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య సమయంలోనే మరోసారి దాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. అలాగే బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాపై ఆమె తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనూ గొడవకు దిగారు. ఓ రకంగా చిన్న పాటి యుద్దమే చేసింది కంగనా.
ప్రస్తుతం సినిమాల పరంగా చూస్తే, ఆమె జయలలిత బయోపిక్ `తలైవి`తోపాటు `ధాఖడ్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు ఓ చిత్రం ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో మహిలా పైలట్గా నటిస్తుంది.
ఇటీవల జయలలిత బయోపిక్ `తలైవి` షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యింది కంగనా. `జయలలిత వంటి గొప్ప నాయకురాలి పాత్రలో నటించడం జీవితకాల అవకాశంగా భావిస్తున్నా. ఈ చిత్రీకరణ ముగించడం బాధగా ఉంది` అని పేర్కొంది.