`బాహుబలి`కి రాజమౌళి వాడిన స్ట్రాటజీనే `సలార్`కి ఫాలో అయిన ప్రశాంత్ నీల్.. ప్లాన్ మామూలుగా లేదుగా..
`సలార్` సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్.. `బాహుబలి` స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. అప్పుడు రాజమౌళి ఏం చేశాడో, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా అదే చేశాడు.
`సలార్` సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుంది. చాలా రోజులు తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి మాస్, యాక్షన్ మూవీ రావడంతో ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. `బాహుబలి` తర్వాత ప్రభాస్ నుంచి హిట్ లేకపోవడంతో ఆ ఆకలి తీర్చే మూవీగా `సలార్` నిలవడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. సినిమాలో తమకు కావాల్సిన మాస్, యాక్షన్ ఎలిమెంట్లు ఉండటంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాని చూస్తున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hjapd9dxvkkjv3sf8ktkrq74/screenshot-2023-12-23-120502-png_300x174xt.jpg)
ఈ లెక్కన `సలార్` తొలి రోజు భారీ కలెక్షన్లని రాబట్టబోతుంది. `ఆర్ఆర్ఆర్`, `బాహుబలి` కాకుండా మిగిలిన అన్ని సినిమాల ఓపెనింగ్ని దాటేయబోతుంది. నార్త్ లో `డంకీ` ఎఫెక్ట్ లేకపోతే ఆ రెండు సినిమాలను దాటిని ఆశ్చర్యం లేదు. ప్రభాస్ కటౌట్కి తగ్గ సాలిడ్ మూవీ పడితే ఆయన రేంజ్ ఎలా ఉంటుందో `సలార్` నిరూపించింది. బాక్సాఫీసుకి రుచి చూపించింది.
ఇదిలా ఉంటే సినిమా తీసిన విధానం, ఫస్ట్ పార్ట్ కట్ చేసిన విధానం, క్లైమాక్స్ చూపించిన విధానం చూస్తుంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ పెద్ద స్కెచ్చే వేసినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో ఆయన `బాహుబలి` స్ట్రాటజీని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. `బాహుబలి` మొదటి పార్ట్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నని వదిలేశాడు. అదే పెద్ద చర్చకు దారి తీసింది. రెండో పార్ట్ కి ప్రమోషన్ చేసి పెట్టింది. సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేసేలా చేసింది.
ఇప్పుడు `సలార్`లోనూ అదే ఛాయలు కనిపించాయి. `బాహుబలి`లో ప్రభాస్.. తన మహీష్మతి సామ్రాజ్యాన్ని వదిలి దూరంగా అనామకులుగా జీవిస్తుంటారు. ఇందులోనూ ప్రభాస్ మొదట ఖాన్సార్కి దూరంగా సాధారణ మెకానిక్ లైఫ్ని జీవిస్తుంటాడు. ఆ తర్వాత కట్టప్ప, అనుష్క ద్వారా ఫ్లాష్ బ్యాక్ బయటకు వస్తుంది. ఇందులో శృతి హాసన్ కారణంగా మళ్లీ ఖాన్సార్ చరిత్ర బయటకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అయితే `బాహుబలి`లో బాహుబలి, కట్టప్ప ఎంతో స్నేహంగా ఉంటారు. అలాంటిది బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది పెద్ద ప్రశ్న.
ఇప్పుడు `సలార్`లో కూడా వరధ పాత్రలో చేసిన పృథ్వీరాజ్, దేవగా చేసిన ప్రభాస్ మంచి స్నేహితులు. వరధ కోసం అతనికి రాజ్యాన్ని అప్పగించేందుకు దేవ వస్తాడు. ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేంతటి స్నేహం వారిది. అలాంటిది ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది. ఎందుకు విడిపోయారనేది ఇందులో ట్విస్ట్ ఇచ్చి, ప్రశ్నగా మిగిల్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అదే సమయంలో ప్రభాస్ శౌర్యంగ వంశస్తులుగా చూపించాడు. ఇద్దరి మధ్య గొడవ అయ్యిందా? లేక పృథ్వీరాజ్ కి సింహాసనం కట్టబెట్టాడా? ప్రభాస్ దూరంగా ఎందుకు ఉంటున్నాడు? అనే మిస్టరీ వదిలేశాడు దర్శకుడు. ఆడియెన్స్ లో ఆ క్యూరియాసిటీని వదిలేశాడు.
ఈ లెక్కన అప్పుడు రాజమౌళి ఫాలో అయిన స్ట్రాటజీనే పరోక్షంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది. అయితే ఇదంతా ఆయన ప్లాన్లో భాగమే అయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని ఉంచేందుకు ఆయన చేసిన ట్రిక్ అని చెప్పొచ్చు. `బాహుబలి` రేంజ్లో రెండో పార్ట్ కోసం క్యూరియాసిటీ క్రియేట్ అవుతుందా? అనేది ప్రశ్న. ఎంత మేరకు రెండో పార్ట్ కోసం డిమాండ్ ఉంటుందో చూడాలి. ఇక రెండో పార్ట్ కి `సలార్ః శౌర్యంగ పర్వం`అనే టైటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.