చేతిలో పనిలేదు, పదేళ్లుగా వేధిస్తున్న వ్యాధి... నటి దుర్భర పరిస్థితి తెలుసుకొని షాకైన ఫ్యాన్స్!
కరోనా వైరస్ నటుల జీవితాలను నాశనం చేస్తుంది. చిత్రపరిశ్రమపై ఆధారపడిన అనేక మంది నటులు పనిలేక దుర్భరమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో పాటు కొత్త ప్రాజెక్ట్స్ మొదలు కావడం లేదు. దీనితో నటులకు అవకాశాలు కరువవుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటి సుమోనా చక్రవర్తి తాను ఎదుర్కొంటున్న దీన పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. చాలా కాలంగా ఆఫర్స్ లేవని, దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు.
మరో వైపు తాను పదేళ్లుగా గర్భాశయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చారు. లాక్ డౌన్ తన కెరీర్ పై, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఆమె వివరించారు. అలాగే గడ్డుపరిస్థితుల నుండి తాను బయటపడిన తీరును ఆమె వెల్లడించడం విశేషం.
సుమోనా మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత వ్యాయామం చేశాను. చాలా బాగా అనిపించింది. కొంతకాలంగా చేతిలో ప్రాజెక్ట్స్ లేవు. నిరుద్యోగిగా మారాను. నా మీద నాకే కోపం వచ్చేది. చాలా గిల్టీగా ఫీలయ్యేదాన్ని. నిరుద్యోగిగా ఉన్నప్పటికి కూడా నా కుటుంబాన్ని, నన్ను పోషించుకోగల్గుతున్నాను. అది చాలా మంచి విషయం.
ఇక లాక్డౌన్ వల్ల కలిగిన మానసిక సమస్యలు దూరం చేసుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ముఖ్యంగా ఒత్తిడికి లోనవ్వకుండా ఉండటం ముఖ్యం అన్నారు.
2011 నుంచి నేను ఎండోమెట్రియోసిస్తో పోరాడుతున్నాను. ఈ విషయం నేను ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఈ వ్యాధి నాల్గో దశలో ఉంది. ఒత్తిడి అస్సలు మంచిది కాదు. ఇది చదివిన వారందరూ ఓ విషయం అర్థం చేసుకోవాలి.
మెరిసేదంతా బంగారం కాదు. అలానే మా జీవితాలు వడ్డించిన విస్తరి కావు. మాకు చాలా సమస్యలుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. దానితో పోరాడుతుంటాం. మన చుట్టూరా ఎక్కువగా నష్టం, అసహనం, ద్వేషం, దుఖం, ఒత్తిడి, నొప్పి ప్రతికూల భావనలే ఉంటాయి. కానీ మనకు కావాల్సింది ప్రేమ, దయ. అవి ఉంటే చాలు ఈ తుపానును దాటగల్గుతాం.. అన్నారు.
పర్సనల్ ప్రాబ్లమ్స్ బహిరంగంగా చెప్పడం అంత సులువైన విషయం కాదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తున్నాను. ఈ పోస్ట్ కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలదని.. కొందరిలోనైనా చిరునవ్వులు పూయించగలదని ఆశిస్తున్నాను... అంటూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .