అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. బీసీసీఐ బాస్ దాదా సంచలన వ్యాఖ్యలు
Sourav Ganguly: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీ కాలం ఈనెల 18న ముగియనుంది. ఆ తర్వాత బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు.

Sourav Ganguly
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమవుద్ది..? ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి పరిస్థితి ఇంచుమించు అదే స్టేజ్ లో ఉంది. రెండో సారి బీసీసీఐ అధ్యక్షుడై ఆ తర్వాత ఐసీసీకి వెళ్లాలన్న దాదా ఆశలను బీసీసీఐ పెద్దలు ఆదిలోనే సమాధి చేశారు. ‘నీ సేవలు చాలు.. ఇక సెలవు..’ అని దాదాను అధ్యక్ష పీఠం నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది.
గంగూలీకి బీసీసీఐలో మోసం జరిగిందని అతడి అభిమానులు వాపోతున్న నేపథ్యంలో దాదా స్పందించాడు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తత్వ సూత్రాలు చెబుతున్నాడు. గత వారం రోజులుగా బీసీసీఐ లో జరుగుతున్న పరిణామాల గురించి నోరు మెదపని దాదా.. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా మాట్లాడుతూ.. ‘నేను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు ఐదేండ్లు అధ్యక్షుడిగా పనిచేశాను. బీసీసీఐ చీఫ్ గా కూడా మూడేండ్లు ఉన్నాను. ఇవన్నీ ముగిశాక బీసీసీఐ నుంచి నిష్క్రమించే సమయం వచ్చింది.
ఒక అడ్మినిస్ట్రేటర్ గా జట్టు ప్రయోజనాల కోసం పాటుపడాలి. నేను ఆటగాడిగా ఉన్నప్పుడు ఇదే అర్థం చేసుకున్నాను. ఆటగాడి నుంచి పరిపాలనకు వచ్చాక కూడా నేను నా పనిని సంతోషంగా నిర్వర్తించాను. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఆటగాడిగా కానీ అడ్మినిస్ట్రేటర్ గా గానీ ఎక్కువ కాలం పదవిలో ఎవరూ ఉండలేరు..’ అని తెలిపాడు.
దాదా పనితీరు నచ్చకపోవడంతోనే అతడిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించి 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీని బీసీసీఐ తదుపరి బాస్ గా నియమిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బిన్నీ ఎంపిక లాంఛనమే అయినా దాదాకు అన్యాయం జరిగిందని వాపోయే వాళ్లు కూడా లేకపోలేదు.
దాదాను నమ్మించి మోసం చేశారని కొందరు ఆరోపిస్తుండగా.. బీజేపీలో చేరకపోవడం వల్లే అతడిని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వెళ్లగొడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. వారం రోజులుగా సాగుతున్నఈ చర్చకు ముగింపు పలికేందుకు పై విధంగా వ్యాఖ్యానించి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.