ఐదు జట్లు.. 2 వేదికలు.. మహిళల ఐపీఎల్కు ఫైనల్ టచ్ ఇస్తున్న బీసీసీఐ
Women's IPL: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పురుషుల ఐపీఎల్ మాదిరే బీసీసీఐ.. మహిళల ఐపీఎల్ ను కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.

2007లో మొదలై ఇన్నాళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో మీడియా హక్కుల ద్వారా ఏకంగా రూ. 48 వేల కోట్లు తన ఖాతాలో వేసుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు మహిళల ఐపీఎల్ మీద దృష్టి సారించింది.
వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్ కు బీసీసీఐ పెద్దలు ఫైనల్ టచ్ ఇస్తున్నారు. ఉమెన్స్ ఐపీఎల్ లో ఎన్ని జట్లు ఉండనున్నాయి..? మ్యాచ్ లను ఎక్కడ నిర్వహిస్తారు..? ఒక జట్టులో విదేశీ ఆటగాళ్లు ఎంతమంది ఉంటారు..? అనేదానిపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
Image credit: IPL
క్రిక్ బజ్ లో వచ్చిన సమాచారం మేరకు వచ్చే ఏడాది నిర్వహించబోయే ఈ మెగా లీగ్ లో ఐదు జట్లు ఉండనున్నాయి. ఒక్కో జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్లను అనుమతించనున్నారు. పురుషుల ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల సంఖ్య నాలుగు మాత్రమే. కానీ ఉమెన్స్ ఐపీఎల్ లో మాత్రం ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను తీసుకోవడానికి అనుమతినిచ్చారు. అయితే ఇందులో ఒకరు తప్పకుండా ఐసీసీ అసోసియేట్ దేశాల నుంచి ఉండాలి.
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీని 2023 మార్చిలో నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఆ ఏడాది ఆరంభంలో టీ20 ప్రపంచకప్ ముగిశాక ఐపీఎల్ ను ప్రారంభించనున్నారు.
ఐపీఎల్ మాదిరిగా ఏ జట్టుకు ఆ నగరం (అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ లా కాకుండా) లో మ్యాచ్ లు కాకుండా రెండు వేదికలలో మాత్రమే నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు వేదికలేమిటి..? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఐపీఎల్ లో జరిగినట్టే గ్రూప్ దశ మ్యాచ్ లు, ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఫార్మాట్ లో ఉమెన్స్ ఐపీఎల్ కూడా జరుగుతుంది. గ్రూప్ దశలో 20 మ్యాచ్ లు (ఒక్కో జట్టు ఇతర జట్టుతో రెండేసి మ్యాచ్ లు) జరుగుతాయి. జట్ల విషయానికొస్తే నగరాల మాదిరిగా కాకుండా జోన్ల వారీగా జట్లను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నది.
అంటే ముంబై, చెన్నై, ఢిల్లీ వలే కాకుండా నార్త్ (ధర్మశాల/జమ్మూ), సౌత్ (కొచ్చి/వైజాగ్), సెంట్రల్ (ఇండోర్/నాగ్పూర్/రాయ్పూర్), ఈస్ట్ (రాంచీ/కటక్), నార్త్ ఈస్ట్ (గువహతి), వెస్ట్ (పూణె/రాజ్కోట్) లకు ఇవ్వాలన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ కొత్త బాసులు నిర్ణయం తీసుకోనున్నారు.