- Home
- Sports
- Cricket
- ఆసీస్పై షార్జాలో సచిన్ ఆడిన ఇన్నింగ్స్ను ‘డిసర్ట్ స్ట్రోమ్’ అని ఎందుకంటారు? కారణమిదే..!
ఆసీస్పై షార్జాలో సచిన్ ఆడిన ఇన్నింగ్స్ను ‘డిసర్ట్ స్ట్రోమ్’ అని ఎందుకంటారు? కారణమిదే..!
Sachin Tendulkar: ప్రపంచ క్రికెట్ లో తన ఆటతో గుర్తింపు సాధించిన సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచి వచ్చిన మరుపురాని ఇన్నింగ్స్ వందలకొద్దీ ఉన్నాయి. అందులో షార్జా స్టేడియంలో ఆస్ట్రేలియాపై చేసిన 143 కూడా ఒకటి.

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన పాతికేండ్ల క్రికెట్ కెరీర్ లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్న నిబంధనలను అనుకూలంగా మలుచుకుని ప్రస్తుత క్రికెట్ లో చాలా మంది పరుగుల యంత్రాలుగా పేరు తెచ్చుకుంటుండొచ్చు గానీ ఇవేమీ లేకముందే సచిన్ ప్రపంచ క్రికెట్ ను ఏలాడు.
మిలీనియల్ బ్యాచ్కు అంతగా తెలియకపోవచ్చు గానీ బ్యాట్ నుంచి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ వచ్చాయి. అందులో యూఏఈలో షార్జా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా వంటి దిగ్గజ టీమ్ తో చేసిన 143 పరుగుల ఇన్నింగ్స్ వెరీ వెరీ స్పెషల్. ఈ ఇన్నింగ్స్ ను ‘డిసర్ట్ స్ట్రోమ్’ (ఎడారి తుఫాను) అంటుంటారు క్రికెట్ అభిమానులు. అలా ఎందుకంటారు..?
సరిగ్గా 25 ఏండ్ల క్రితం.. 1998లో యూఏఈ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ జట్లు కోకోకోలా కప్ ఆడాయి. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య సరిగ్గా ఇదే తేదీ (ఏప్రిల్ 22) న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మైఖేల్ బెవాన్ (101) సెంచరీ చేయగా మార్క్ వా (81) రాణించాడు.
ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. సౌరవ్ గంగూలీ (17), నయాన్ మోంగియా (35), కెప్టెన్ అజారుద్దీన్ (14), అజయ్ జడేజా (1), వీవీఎస్ లక్ష్మణ్ (23) అంతా విఫలమయ్యారు. కానీ సచిన్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 143 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 250 పరుగులే చేయగలిగింది.
భారత్ ఈ మ్యాచ్ ఓడినా సచిన్ ఇన్నింగ్స్ ను ఇసుక తుఫాను అనడానికి గల కారణాలను తాజాగా షార్జా స్టేడియం మేనేజింగ్ డైరెక్టర్ మజర్ ఖాన్ వెల్లడించాడు. ‘ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా అనుకోకుండా షార్జా స్టేడియంపై మబ్బులు కమ్మాయి. నేను దానిని ఇసుక తుఫాను అని చెబుతాను. కానీ అది ముగిశాకే అసలు కథ మొదలైంది. దానిని మాత్రం డిసర్ట్ స్ట్రోమ్ అనాల్సిందే.
ఆ తుఫాను (సచిన్ ఇన్నింగ్స్ ను ఉద్దేశిస్తూ..) కవర్స్, మిడ్ వికెట్, మిడాన్, కవర్ పాయింట్.. ఇలా షార్జాలో ఉన్న ప్రతీ ఏరియాను ముంచెత్తింది. ఆ ఇన్నింగ్స్ ను నేను మాటల్లో వర్ణించలేను. అందుకే సచిన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటాన్నేను..’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్ కు ఇసుక తుఫాను అంతరాయం కలిగించడంతో మ్యాచ్ లో భారత్ టార్గెట్ ను 46 ఓవర్లలో 276 పరుగులుగా నిర్ణయించారు. కానీ భారత్ 250 పరుగులు మాత్రమే చేసింది. అందులో సగం సచిన్ చేసినవే కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో ఓడినా భారత్.. ఫైనల్ లో ఆసీస్ ను ఓడించింది. ఫైనల్ లో ఆసీస్.. 272 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్.. 48.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో కూడా సచిన్.. సెంచరీ (132) చేశాడు. అజారుద్దీన్ (58) కూడా రాణించాడు.