‘వాళ్లిద్దరినీ బంగ్లాదేశ్లో పెళ్లికి తీసుకెళ్లారా..? ఎందుకు అక్కడ కూర్చోబెడుతున్నట్టు..? ’
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సిరీస్ ను 0-2 తేడాతో ఓడింది. మరో మ్యాచ్ మిగిలిఉండగానే ఈ సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన భారత తుదిజట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ ఏడాది వరుసగా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ లో కూడా సిరీస్ కోల్పోయింది. మిగతావాటిని పక్కనబెడితే బంగ్లాపై ఓడటం భారత్ ను బాగా దెబ్బతీసింది.
తొలి వన్డేలో ఒక్క వికెట్ తీయలేక చతికిలపడ్డ భారత జట్టు.. రెండో వన్డేలో రోహిత్ వీరోచిత పోరాటం చేసినా ఐదు పరుగుల తేడాతో ఓడాల్సి వచ్చింది. అయితే ఈ సిరీస్ లో భారత జట్టు తుది కూర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Rahul Tripathi
ముఖ్యంగా ఈ సిరీస్ కు ఎంపికైన రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ లను బంగ్లాదేశ్ కు ఎందుకు పంపించినట్టు అని మాజీ సెలక్టర్ సబా కరీం విమర్శలు గుప్పించాడు. టీ20 స్పెషలిస్టు అయిన రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ లను వన్డే సిరీస్ కోసం ఎంపిక చేయడం తెలివితక్కువ పని అని విమర్శించాడు.
బంగ్లాతో సిరీస్ కోల్పోయిన తర్వాత కరీం ఇండియా న్యూస్ తో మాట్లాడుతూ.. ‘అసలు మీరు (సెలక్టర్లు) రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ లను బంగ్లాదేశ్ కు ఎందుకు పంపించారు...? వన్డేలలో త్రిపాఠిని ఎందుకు ఎంపిక చేసినట్టు..? అసలు అతడు అంతగొప్పగా ఏం ఆడాడని వన్డేలకు తీసుకున్నారు..?
అతడు వన్డేలకు పనికొస్తాడని నేనైతే అనుకోవడం లేదు. త్రిపాఠి టీ20 స్పెషలిస్టు. పాటిదార్ ను తీసుకెళ్లి బెంచ్ కే పరిమితం చేస్తున్నారు. వన్డేలు, టీ20లలో కోర్ టీమ్ ను తయారుచేసుకోవడంపై సెలక్టర్లు ఇప్పటికైనా దృష్టిపెట్టాలి. కొత్త సెలక్షన్ కమిటీ అయినా అలా చేస్తుందో లేదో చూడాలి..’ అని అన్నాడు.
రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడు మూడో వన్డే ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో త్రిపాఠి, పాటిదార్ లలో ఎవరో ఒకరు ఈనెల 10 న బంగ్లాదేశ్ తో జరుగబోయే మూడో వన్డేలో ఆడే ఛాన్స్ ఉంది. సిరీస్ ఎలాగూ కోల్పోయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తున్నది.