- Home
- Sports
- Cricket
- IPL: నలుగురు నాలుగు రకాలు.. టైటిల్ విజేతలెవరు..? క్రికెట్ పండితుల అంచనా ఇదే.. ఆ జట్టుకే మొగ్గు..
IPL: నలుగురు నాలుగు రకాలు.. టైటిల్ విజేతలెవరు..? క్రికెట్ పండితుల అంచనా ఇదే.. ఆ జట్టుకే మొగ్గు..
IPL 2022 Play Offs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశకు చేరింది. నేటి (మంగళవారం) నుంచి కోల్కతా వేదికగా ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ పండితులుగా మారిన మాజీ క్రికెటర్లు ఈసారి విజేత ఎవరో తేల్చారు.

రెండునెలలుగా సాగుతున్న ఐపీఎల్ తుది అంకానికి చేరింది. లీగ్ దశను రెండ్రోజుల క్రితమే ముగించుకున్న ఐపీఎల్ లో నేటి నుంచి ఈడెన్ గార్డెన్ (కోల్కతా) వేదికగా ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. తొలి క్వాలిఫైయర్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరుగనున్నది.
ఎలిమినేటర్ మ్యాచ్ కూడా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-15 విజేత ఎవరు..? అన్న ప్రశ్నకు పలువురు మాజీ క్రికెటర్లు తమదైన అంచనా వేసి విజేత ఎవరో తేల్చారు. టీమిండియాకు గతంలో ఆడిన వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్ తో పాటు ఆర్సీబీ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేలు ఐపీఎల్ - 2022 విజేతపై తమ అంచనా చెప్పారు.
వీరేంద్ర సెహ్వాగ్ ప్రకారం.. ఈ లీగ్ లో తొలిసారి ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ నెగ్గే అవకాశముంది. లీగ్ దశలో అదరగొట్టిన ఆ జట్టు.. ప్లేఆఫ్స్ తో పాటు ఫైనల్స్ లో కూడా బాగా ఆడి టైటిల్ విజేత గా నిలుస్తుందని వీరూ అంచనా వేశాడు. హార్ధిక్ పాండ్యా సారథ్యాన్ని అతడు ప్రశంసించాడు.
సురేశ్ రైనా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆర్సీబీ తప్పకుండా కప్ కొడుతుందని అంచనా వేశాడు. ప్లేఆఫ్స్ చేరుకోవడానికి నానా కష్టాలు పడి చివరికి ముంబై పుణ్యమా అని ప్లేఆఫ్స్ వెళ్లిన ఆర్సీబీ.. తర్వాత మ్యాచులలో మాత్రం కచ్చితంగా అదరగొడుతుందని రైనా చెప్పాడు.
పార్థీవ్ పటేల్ ప్రకారం.. ఈసారి విజేత రాజస్తాన్ రాయల్స్. ఆ జట్టులోని కీలక ఆటగాడు జోస్ బట్లర్ చెలరేగితే ప్రత్యర్థులకు ఆశలు కూడా ఉండవని పటేల్ చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఆ జట్టు అధ్బుతంగా ఉన్నదని , ట్రోఫీ నెగ్గే అవకాశాలు ఎక్కువగా రాజస్తాన్ కే ఉన్నాయని తెలిపాడు.
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ ను విజేతగా తేల్చారు. బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా.. బౌలింగ్ చూసినా రాజస్తాన్ కు తిరుగేలేదని ఈ సీజన్ విజేత రాజస్తాన్ అవుతుందని ఆయన జోస్యం చెప్పాడు.
ఆర్సీబీ మాజీ సారథి డేనియల్ వెటోరీ ప్రకారంం.. రాజస్తాన్ రాయల్సే ఈ సీజన్ లో విజేతలుగా నిలుస్తారని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో ఆ జట్టు సమతూకంగా ఉందని ఇతర జట్లతో పోలిస్తే రాజస్తాన్ కే ట్రోఫీ నెగ్గే అవకాశాలున్నాయని వివరించాడు.
ప్రస్తుతం ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న జట్లలో రాజస్తాన్ రాయల్స్ (2008) తప్ప మూడు జట్లు ఇంతవరకు ట్రోఫీ నెగ్గలేదు. ఆర్సీబీ పలుమార్లు ఫైనల్ కు చేరినా ఆ జట్టు ఆఖరి మెట్టు మీద బోల్తా పడింది. ఇక ఈ సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చిన లక్నో, గుజరాత్ ల మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఏదేమైనా ఈసారి కొత్త విజేతను చూడటం ఖాయమని పలువురు చెబుతుంటే రాజస్తాన్ రాయల్స్ కే ఆ అర్హతలు ఎక్కువగా ఉన్నాయని మరికొందరు అంటున్నారు. మరి అసలు విజేత ఎవరో మే 29న తేలనుంది.