ప్రతీ మ్యాచ్ ఫైనల్లా ఆడతాం... సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ రషీద్ ఖాన్ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్లో ప్లేఆఫ్ చేరుతుందని ఏ మాత్రం ఆశలు లేని జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఫేజ్ 1లో ఆరెంజ్ ఆర్మీలో జరిగిన హై డ్రామా అంతా ఇంతా కాదు. ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్, ఫ్లేఆఫ్ చేరాలంటే మిగిలిన మ్యాచులన్నీ గెలిచి తీరాల్సిందే...
భారత్లో జరిగిన తొలి సగంలో ఆరు మ్యాచుల తర్వాత కెప్టెన్ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ తర్వాతి మ్యాచ్లో మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కి తుదిజట్టులో చోటు కూడా దక్కలేదు...
అయితే ఫేజ్ 2 సీజన్లో ప్రతీ మ్యాచ్ను ఫైనల్గా భావించి, నూటికి నూరు శాతం పోరాడతామని అంటున్నాడు ఆఫ్ఘాన్ ఆల్రౌండర్, సన్రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్...
‘టోర్నీ ఫస్టాఫ్లో మాకు శుభారంభం దొరకలేదు. మేం ఇప్పటికీ ప్లేఆఫ్ రేసులో ఉన్నాం. ఇకపై జరగబోయే ప్రతీ మ్యాచ్ మాకు ఫైనల్ లాంటిదే. నూటికి నూరు శాతం కష్టపడి, టోర్నీని బెటర్ ప్లేస్లో ముగించాలని కోరుకుంటున్నాం...
నేను గత ఏడాదిన్నరగా బ్యాటింగ్పైన కూడా ఫోకస్ పెట్టాను. బ్యాటుతో చేసే 15-25 పరుగులు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలవు. అందుకే నెట్స్లో షాట్స్ ఆడుతూ పాజిటివ్ మైండ్సెట్తో ఐపీఎల్కి సిద్ధమవుతున్నా..’ అంటూ కామెంట్ చేశాడు రషీద్ ఖాన్...
యూఏఈలో చాలా మ్యాచులు ఆడిన రషీద్ ఖాన్, తనకి అక్కడి పిచ్లపై పూర్తి అవగాహన ఉందని కామెంట్ చేశాడు. ఇప్పటిదాకా ఏడు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది...
గత ఐపీఎల్ 2020 సీజన్లో గ్రూప్ స్టేజ్లో ముంబై ఇండియన్స్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి, ప్లేఆఫ్స్కి చేరిన సన్రైజర్స్ హైదరాబాద్... మూడో స్థానంలో నిలిచింది...
ఈసారి కూడా కేన్ విలియంసన్ కెప్టెన్సీలో అలాంటి మ్యాజిక్ జరుగుతుందని, జరగాలని కోరుకుంటున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు...