అతడికి ఆర్సీబీ ఇచ్చేది చాలా తక్కువ.. వాడుకునేదే ఎక్కువ.. బెంగళూరు బౌలర్ కు మద్దతుగా సెహ్వాగ్
Harshal Patel: ఐపీఎల్ లో రెండు సీజన్లుగా అంచనాలకు మించి రాణిస్తున్న ఆటగాళ్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్ ఒకడు. ఈ వేలంలో ఆర్సీబీ అతడిని రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ పై టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఆర్సీబీ అతడి సేవలను అవసరానికి మించి వాడుకుంటున్నదని.. కానీ హర్షల్ కు చెల్లించేది ఇతరులతో పోలిస్తే చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు.
లక్నో సూపర్ కింగ్స్ తో రెండ్రోజుల క్రితం ఈడెన్ గార్డెన్ లో ముగిసిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో 24 పరుగులు అవసరమనగా.. బంతిని అందుకున్న పటేల్ కేవలం 9 పరుగులే ఇచ్చాడు. ఈ ఒక్క మ్యాచే గాక హర్షల్ చాలా మ్యాచులలో ఆర్సీబీ గెలుపులలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో వీరూ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘మనం ఈ సీజన్ లో రాహుల్ తెవాటియా (వేలంలో రూ. 9 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది) తనకు దక్కిన ధరకు న్యాయం చేయగలుగుతాడా..? మరో ఆటగాడు అతడికి వచ్చిన ధరకు తగ్గట్టు ఆడతాడా..? అని చర్చించాం..
కానీ వాళ్లతో పోలిస్తే హర్షల్ పటేల్ కు వేలంలో దక్కిన మొత్తం తక్కువ అని నా అభిప్రాయం. ఆర్సీబీ తరఫున అతడు ఎంత అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడో చూడండి.
ప్రత్యర్థులకు కట్టడి వేస్తూ తన జట్టును చాలా సార్లు ఆదుకున్నాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బంతులతో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి ప్రతిభకు ఆర్సీబీ ఇచ్చే రూ. 10.75 కోట్లు చాలా తక్కువ. నా దృష్టిలో అతడు రూ. 14 - 15 కోట్ల కేటగిరీకి చెందిన ఆటగాడు’ అని అన్నాడు.
అంతేగాక.. ‘స్లాగ్ ఓవర్స్ లో అతడు ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడో చూడండి. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడమే గాక వికెట్లు కూడా తీస్తూ తన జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. కొన్నిసార్లు ఇతర బౌలర్లంతా విఫలమైన చోట హర్షల్ బాగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాలు చేకూర్చుతున్నాడు..’ అని తెలిపాడు.
వీరూ చెప్పినట్టు.. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుతమైన రీతిలో బంతులు విసరుతూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గతేడాది (31 వికెట్లు) పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్.. ఈ ఏడాది కూడా 14 మ్యాచులలో 19 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలాఉండగా శుక్రవారం ఆర్సీబీ.. రాజస్తాన్ రాయల్స్ తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫైయర్ లో భాగంగా బెంగళూరు-రాజస్తాన్ తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన విజేత మే29న గుజరాత్ తో ఫైనల్ ఆడుతుంది.