త్వరలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తాడు... మాజీ క్రికెటర్ కిరణ్ మోరే...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కెప్టెన్సీ వైరం చాలా రోజులుగా నడుస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్... ఐపీఎల్లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు టీ20, వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మరే ఈ విషయం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లతో పాటు వెస్టిండీస్, శ్రీలంక వంటి జట్లు కూడా వన్డే, టీ20 ఫార్మాట్లకు ఓ కెప్టెన్, టెస్టు ఫార్మాట్కి మరో కెప్టెన్ పద్ధతిని అనుసరిస్తున్నాయి.
పాకిస్తాన్, న్యూజిలాండ్తో పాటు టీమిండియా వంటి జట్లు మాత్రమే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ పద్ధతిని అనుసరిస్తున్నాయి. అయితే టీమిండియా కూడా త్వరలోనే ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాను అనుసరించబోతోందని అంటున్నాడు కిరణ్ మోరే..
‘నాకు తెలిసి బీసీసీఐ కూడా ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. రోహిత్ శర్మ త్వరలోనే కెప్టెన్సీ ఛాన్స్ దక్కించుకుంటాడు.
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల్లో కెప్టెన్సీ వదులుకున్నట్టు, విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించొచ్చు. ఇంకెంత కాలం వన్డే, టీ20ల్లో కెప్టెన్సీ భారం మోయాలనేది కోహ్లీ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు.
ఇంగ్లాండ్ టూర్ తర్వాత ఈ విషయం గురించి చాలా పెద్ద చర్చే జరుగుతుంది. త్వరలోనే విరాట్ కోహ్లీ, ‘ఇక చాలు... వన్డే, టీ20 జట్లను రోహిత్ లీడ్ చేయాలి’ అని చెబుతాడు.
ఇద్దరు కెప్టెన్ల సంస్కృతి, ఇండియాలో కూడా వర్కవుట్ అవుతుంది. అయితే సీనియర్ ప్లేయర్లు టీమిండియా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇన్నాళ్లు కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు.
అయితే మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తూ, బ్యాట్స్మెన్గా రాణించడం అంత ఈజీ కాదు. ఎంతకాలమని విరాట్ ఈ భారాన్ని ఒక్కడే మోయగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మోరే.
8 సీజన్లలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచాడు ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. ఇదే టైమ్లో విరాట్ కోహ్లీ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దీంతో గౌతమ్ గంభీర్ వంటి సీనియర్లు కూడా టీ20 కెప్టెన్సీ రోహిత్కి అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే విరాట్ కోహ్లీ ఒకవేళ టెస్టులకు మాత్రమే కెప్టెన్గా కొనసాగాలని నిర్ణయించుకున్నా, రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీనియర్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగిస్తే, రెండు మూడేళ్ల తర్వాత మరో కెప్టెన్ కోసం వెతకాల్సి ఉంటుంది. కాబట్టి కోహ్లీ ఒకే ఫార్మాట్కి పరిమితం అవ్వాలని భావిస్తే, టీమిండియా కెప్టెన్సీ యువ క్రికెటర్లకు దక్కొచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్తో పాటు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్... భావి కెప్టెన్ రేసులో ఉన్నారు. వీరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ అయ్యర్కి లేదా పంత్కి దక్కే అవకాశాలే ఎక్కువ.