- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ఇక్కడిదాకా వస్తుందని నేనైతే కలలో కూడా అనుకోలేదు.. ఇది మహాద్భుతం : టీమిండియా మాజీ సారథి వ్యాఖ్యలు
ఐపీఎల్ ఇక్కడిదాకా వస్తుందని నేనైతే కలలో కూడా అనుకోలేదు.. ఇది మహాద్భుతం : టీమిండియా మాజీ సారథి వ్యాఖ్యలు
IPL Media Rights: పదిహేనేండ్ల క్రితం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇవాళ ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదగడం నిజంగా మహాద్భుతమని కొనియాడాడు టీమిండియా మాజీ సారథి సునీల్ గవాస్కర్.

ముంబైలో గత రెండ్రోజులుగా జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల లెక్కలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. మీడియా హక్కుల విలువ సుమారు రూ. 47వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ సారథి సునీల్ గవాస్కర్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఐపీఎల్ ఈస్థాయికి ఎదుగుతుందని తాను కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చాడు. మీడియా హక్కులపై గవాస్కర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
‘ఐపీఎల్ ప్రారంభమైన (2008) సమయంలో ఈ లీగ్ ఇంతటి స్థాయికి ఎదుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. 15 ఏండ్ల తర్వాత మీడియా హక్కుల ద్వారా ఈ లీగ్ ఆర్జిస్తున్న ఆదాయం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇది నిజంగా అద్భుతం. మహాద్భుతం.
Image credit: PTI
ఐపీఎల్ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ప్రతి సీజన్ లో ప్రేక్షకులు కవరేజీ నాణ్యతను చూస్తున్నారు. మ్యాచుల సంఖ్య పెరుగుతుండటం కూడా మంచిదే. వీక్షకులు దీనిని అమితంగా ఇష్టపడుతున్నారు. వేలం ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో వచ్చే ఏడాది నుంచి కవరేజీ మరింత నాణ్యత పెరుగుతుంద’ని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
మీడియా హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన బీసీసీఐ.. ఆది, సోమ వారాలలో ఎ-టీవీ ప్రసార హక్కులు (ఒక్కో మ్యాచ్ కు రూ. 57.5 కోట్లు.. మొత్తంగా 23,575 కోట్లు) బి- డిజిటల్ హక్కులు (ఒక్కో మ్యాచ్ కు రూ. 50 కోట్లు.. మొత్తంగా రూ. 20,500 కోట్లు) ప్యాకేజీలకు వేలం నిర్వహించింది. ఎ,బి ల ద్వారా రూ. 44 వేలకు పైగా కోట్ల ఆదాయం బీసీసీఐకి చేరింది.
గతంలో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లు ఉండగా ఇప్పుడది రూ. 107.5 కోట్లకు చేరడం గమనార్హం. ప్రస్తుతం సి-(ఎంపిక చేసిన మ్యాచులు) డి-ఉపఖండం వెలుపల హక్కులకు వేలం సాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం వరకు ఇ-వేలం ప్రక్రియ రూ. 47వేల కోట్ల వద్ద సాగుతున్నది. ఇది మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.