చుట్టీ ఖతమ్, ఖేల్ షురూ... హాలీడేస్ ముగించుకుని, ప్రాక్టీస్ మొదలెట్టిన టీమిండియా...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఫ్యామిలీస్తో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత క్రికెటర్లు, తిరిగి బయో బబుల్లోకి వచ్చేశారు. 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టీస్ మ్యాచ్ కోసం నెట్స ప్రాక్టీస్ ప్రారంభించేశారు...
జూన్ 23న ముగిసిన ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్లోని వివిధ ఏరియాల్లో తిరుగుతూ హాలీడేస్ ఎంజాయ్ చేశాడు విరాట్ కోహ్లీ అండ్ టీమ్. దాదాపు 23 రోజుల పాటు ఎంజాయ్ చేసిన హాలీడేస్ ముగిశాయి...
ఇంగ్లాండ్లోని వివిధ ఏరియాల్లో ఉన్న భారత జట్టు ప్లేయర్లు అందరూ తిరిగి డుహ్రామ్లోని బయో బబుల్లోకి చేరుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మిగిలిన సభ్యులు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటున్నారు...
వీరితో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్, ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్ జస్ప్రిత్ బుమ్రాలు కూడా నెట్ ప్రాక్టీస్ మొదలెట్టేశారు.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం డుహ్రాన్ చేరుకున్న టీమిండియాకి స్వాగతం పలికారు అక్కడి అధికారులు...
ఇంగ్లాండ్లో భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి విహార యాత్రలు చేస్తూ గడిపేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ... ‘ఛలో భాయ్... చుట్టీ ఖతమ్.. ఇక పని మొదలెడదాం...’ అంటూ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను పోస్టు చేశాడు.
భారత సారథి విరాట్ కోహ్లీ కూడా కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రాలతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసి... ‘తిరిగి ఇండియా జెర్సీలోకి’ అంటూ కాప్షన్ ఇచ్చాడు...
కౌంటీ ఛాంపియన్షిప్లో పాల్గొన్న 11 మంది సభ్యులతో కలిసి జూలై 20 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇప్పటికే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొనే ప్లేయర్లను కూడా ప్రకటించింది కౌంటీ టీమ్...
విల్ రోడ్స్ కెప్టెన్గా వ్యవహరించే కౌంటీ జట్టులో జాక్ కార్సన్, క్రేగ్ మిల్స్, రేహాంద్ అహ్మద్, జాక్ చాపెల్, లియామ్ ప్యాటర్సన్, టామ్ అస్పిన్వాల్, హసీద్ హమీద్, జేమ్స్ రే, ఏథన్ బాంబర్, లేడన్ జేమ్స్, రాబ్ యేట్స్, జేమ్స్ బ్రేసీ, జాక్ లిబ్బీ చోటు దక్కించుకున్నారు.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో కరోనా బారిన పడగా, కరోనా పాజిటివ్గా తేలిన బీసీసీఐ అధికారితో కలిసి తిరిగిన కారణంగా వృద్ధిమాన్ సాహా కూడా క్వారంటైన్లో ఉండడంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్కి కెఎల్ రాహుల్ వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు.
జూలై 20 నుంచి 22 వరకూ సాగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను డుహ్రామ్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.