టీమిండియాకు గుడ్ న్యూస్.. త్వరగా రికవరీ అవుతున్న పేసుగుర్రం..
Jasprit Bumrah: రాబోయే నాలుగు నెలల్లో భారత జట్టు కీలక టోర్నీలు ఆడనున్న నేపథ్యంలో టీమిండియాకు పేసుగుర్రం జస్ప్రిత్ బుమ్రా గుడ్ న్యూస్ చెబుతున్నాడు.

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ చతికిలపడ్డా ఈ ఏడాది టీమిండియా మరో ఐసీసీ టోర్నీ ఆడనుంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. దీనికిముందే టీమిండియా.. శ్రీలంకలో ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గాయాలతో సతమతమై సర్జరీలు ముగించుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిటేషన్ పొందుతున్న ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా కూడా పూర్తిగా కోలుకుని బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు.
ఎన్సీఏలో రిహాబిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడట. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడట..
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ ఇంజ్యూరీ నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్నెస్ కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. ఎన్సీఏ నెట్స్ లో వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు.
క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్నెస్ పై ఓ స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్ తో ఆగస్టులో ఆడతాడో లేదోననేదానిపై ఓ అంచనాకు రావొచ్చు..’అని చెప్పాడు.
బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.