‘డ్రా’గా ముగిసిన సిడ్నీ టెస్టు... గాయాలతో హనుమ విహారి, అశ్విన్ సూపర్ ‘క్లాస్’ ఇన్నింగ్స్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది. అసలు సిసలైన క్రికెట్ మజాని అభిమానులకు పంచింది. భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, పూజారా, రిషబ్ పంత్ అవుట్ అయినా... హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి, అద్భుతం చేశారు... మిగిలిన ఐదు వికెట్లు తీసి రెండో టెస్టులో విజయం సాధించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లారు. హనుమ విహారికి గాయం కావడం, రవీంద్ర జడేజా గాయపడి, బ్యాటింగ్కి రాలేని పరిస్థితిలో ఉండడం లేకపోతే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి షాక్ తగిలేదే...
నాలుగో ఇన్నింగ్స్లో 131 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది టీమిండియా. 1980 తర్వాత ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం భారత జట్టుకి ఇదే తొలిసారి. ఇంతకుముందు సిడ్నీలో 2015లో నాలుగో ఇన్నింగ్స్లో ఆడిన 90 ఓవర్లే అత్యధికం.
నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో 100 బంతులకు పైగా ఎదుర్కొన్నాడు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. చివరిసారిగా 2016లో ఈ ఫీట్ సాధించాడు అశ్విన్.
భారత ఇన్నింగ్స్లో పూజారా, రిషబ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ 100 బంతులకు పైగా బంతులను ఎదుర్కొన్నారు.
నాలుగో ఇన్నింగ్స్లో నలుగురు భారత బ్యాట్స్మెన్ 100 బంతులకు పైగా ఎదుర్కోవడం ఇది రెండోసారి. ఇంతకుముందుకు 1992లో సౌతాఫ్రికాపై ఈ ఫీట్ సాధించింది టీమిండియా.
భారత బ్యాట్స్మెన్ శరీరాలనే టార్గెట్ చేస్తూ బంతులు విసిరిన ఆసీస్ బౌలర్లు... హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్లను కూడా గాయపరిచారు.
బ్యాట్స్మెన్ హనుమ విహారి మోకాలికి గాయం కావడంతో టీ విరామానికి ముందు సింగిల్స్ తీయడానికి కూడా బాగా ఇబ్బందిపడ్డాడు.
నొప్పిని భరిస్తూనే క్రీజులో నిలబడి... ఓవర్లు పాటు బ్యాటింగ్ కొనసాగించాడు హనుమ విహారి... మరోవైపు స్టార్క్ బౌలింగ్లో గాయపడి, నొప్పితో విలవిలలాడిన రవిచంద్రన్ అశ్విన్, ఫిజియో చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ నాలుగో ఇన్నింగ్స్లో మూడు క్యాచులను జారవిరిచాడు.
పంత్, పూజారా, విహారి ఇచ్చిన క్యాచులను అందుకోలేకపోయాడు పైన్. అత్యంత వేగంగా 150 క్యాచులు అందుకున్న టిమ్ పైన్, ఒక ఇన్నింగ్స్లో ఇన్ని క్యాచులు వదిలేయడం ఇదే తొలిసారి.
161 బంతులను ఎదుర్కొన్న హనుమ విహారి, 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు...
128 బంతులను ఎదుర్కొన్న రవిచంద్రన్ అశ్విన్, 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు...
ఈ ఇద్దరూ ఆరో వికెట్కి 259 బంతుల్లో 62 పరుగులు జోడించారు. ఆరో వికెట్కి భారత జట్టు తరుపున ఇదే అత్యధిక బంతుల అజేయ భాగస్వామ్యం...
1980లో పాకిస్తాన్పై 131 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా, మళ్లీ ఇన్నాళ్లకు అదే రికార్డును సమం చేసింది. ఐదో రోజు షెడ్యూల్ ప్రకారం మరో ఓవర్ మిగిలి ఉండగానే డ్రాకి అంగీకరించింది ఆస్ట్రేలియా. లేకపోతే 1958 నాటి నాటి 132 ఓవర్ల రికార్డు కూడా సమమయ్యేది.
ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు చేసిన రెండో జట్టుగా నిలిచింది టీమిండియా. ఇంతకుముందు 1991లో ఇంగ్లాండ్ 335 పరుగులు చేయగా టీమిండియా ఆ రికార్డుకు ఒక పరుగు దూరంలో నిలిచింది.
గాయాలతో బాధపడుతూ, టీమిండియాను ఓటమి నుంచి కాపాడిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు.