నన్నేం చూస్తున్నావ్ సరిగా బౌలింగ్ చెయ్.. బౌలర్ ను భయపెట్టిన ధోని.. సీఎస్కే మాజీ బౌలర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. 2020 లో కూడా ఆ జట్టుది అదే పరిస్థితి.
మైదానంలో ధోని కూల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే ఆట కాకుండా ఆటేతర విషయాలపై దృష్టి సారిస్తే మాత్రం ధోని వారి పాలిట సింహస్వప్నమే. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి.
ఇదే క్రమంలో ఓ చెన్నై బౌలర్ కు కూడా ధోని తో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ధోనిని తదేకంగా చూస్తున్న బౌలర్ దగ్గరికొచ్చిన ధోని.. నువ్వు బౌలింగ్ వేస్తావా..? లేదా..? నన్నెందుకు చూస్తున్నావ్..? అని భయపెట్టేశాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
2020 లో సీఎస్కే జట్టులో సభ్యుడిగా ఉన్న కొండప్పరాజ్ పళిని.. తనకు ధోని తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పళిని మాట్లాడుతూ.. ‘అది 2020 ఐపీఎల్ సీజన్. ఆ ఏడాదే ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు..
ఆ ఏడాది ఐపీఎల్ దుబాయ్ లో జరిగింది. రిటైర్ అయిన తర్వాత ధోని ఆడుతున్న తొలి సీజన్ అది. దాంతో మా క్యాంప్ అంతా ఎంతో ఆదుర్తగా చూస్తున్నాం. సరిగ్గా అదే సమయానికి ధోని రావడంతో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, డేవిడ్ హస్సీలు అతడికి బౌలింగ్ చేయాలని నాకు బంతినిచ్చారు.
ధోనిని చూడటం అదే మొదటిసారి. నేనేమో అతడిని అలాగా చూస్తుండిపోయా.. ధోని నాతో.. ‘నువ్వు ఫుల్ టాస్ లు వేయమని చెప్పాడు. కానీ మొదటి రెండు బంతులు నేను వైడ్స్ వేశాను. అప్పుడు ధోని నా దగ్గరికి వచ్చి.. నన్ను చూడటం మానేసి బౌలింగ్ చెయ్.. నీకు వచ్చిన సహజ ఆట ఆడు. నన్ను చూస్తే ఏమోస్తుంది.. అని అన్నాడు.
దాంతో నేను తర్వాత బంతి ధోని కోరుకున్నట్టుగా ఫుల్ టాస్ వేశాను. అప్పుడు ధోని చాలా సంతోషించాడు. తర్వాత ధోని ఎప్పుడు నెట్ ప్రాక్టీస్ కు వచ్చినా నేనే బౌలింగ్ వేసేవాడిని. నేను ఎప్పుడు కలిసినా ధోని నా పేరుతో పిలిచేవాడు. దానికి నాకు చాలా సంతోషమేసేది..’ అని చెప్పుకొచ్చాడు.
తన ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెన్నై ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు. ఆ సీజన్ లో అత్యంత చెత్త ఆటతో పాయింట్ల పట్టికలో చివర నిలిచింది. కానీ తర్వాత సీజన్ (2021) లో పుంజుకుని ఏకంగా ట్రోఫీ నెగ్గింది.