గంగూలీ కూడా కదిలాడు... కరోనా బాధితుల కోసం కోల్కత్తాలోని ఆసుపత్రులు, ఎన్జీవోలకు సాయంగా...
దేశంలో కరోనా సెకండ్ వేవ్తో బాధపడుతున్న వారికి సాయంగా నిలిచేందుకు బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ముందుకొచ్చాడు. తనవంతుగా కోల్కత్తాలోని ఆసుపత్రులు, ఎన్జీవోలకు 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించాడు.
కోల్కత్తాలోని కొన్ని ఆసుపత్రులకు, స్వచ్ఛంద సంస్థలను పర్యవేక్షించిన సౌరవ్ గంగూలీ బృందం... తక్షణ సాయంగా 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించింది. మున్ముందు మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది సౌరవ్ గంగూలీ కార్యాలయం..
‘దాదా ఇప్పటికే 50 ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను (దాదాపు రూ. 25 లక్షల విలువ) ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసి, వివిధ ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోల్కత్తాలో కొన్ని చోట్ల లాక్డౌన్ అమలులో ఉండడంతో పంపిణీని వేగవంతం చేశారు.
అలాగే పరిస్థితిని బట్టి వీలైనన్ని ఎక్కువ ఆక్సిజన్ కాంన్సేట్రేటర్లను అందించేందుకు గంగూలీ సిద్ధమయ్యారు. ప్రతీ కరోనా బాధితుడికి అవసరమైన ఏర్పాట్లు అందించడంతో పాటు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నాం...
ఈ క్లిష్ట సమయంలో కూడా సాయం చేసేందుకు మా దగ్గర మంచి టీమ్ సిద్ధంగా ఉంది...’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ బృందంలోని సభ్యుడు తానీయా భట్టాచార్య.
దేశంలో కరోనా బాధితుల కోసం ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు తమవంతు సాయం ప్రకటించారు.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, కరోనా బాధితులకు, వారి కుటుంబాల కోసం రోజూ 51 వేల మందికి సరిపడా ఆహారాన్ని తన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు.