- Home
- Sports
- Cricket
- సర్ఫరాజ్ మరో‘సారీ’.. ఫెయిల్యూర్ ప్లేయర్స్నే కొనసాగిస్తామని చెప్పకనే చెప్పిన బీసీసీఐ..
సర్ఫరాజ్ మరో‘సారీ’.. ఫెయిల్యూర్ ప్లేయర్స్నే కొనసాగిస్తామని చెప్పకనే చెప్పిన బీసీసీఐ..
INDvsAUS: ఇటీవల భారత జట్టు సెలక్షన్స్ విషయంలో అత్యంత చర్చ జరుగుతున్న పేరు సర్ఫరాజ్ ఖాన్. ఈ ముంబై కుర్రాడు దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ తర్వాత అంతటి ఖ్యాతి దక్కించుకుంటున్న సర్ఫ్రాజ్ కు ఎంత చేసినా భారత జట్టులో చోటు దక్కడం లేదు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గతంలో భారత జట్టును ప్రకటించకముందే ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ తప్పక చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. కానీ అతడి స్థానంలో టీ20లలో అదరగొడుతున్నాడని సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించింది టీమ్ మేనేజ్మెంట్.
నాగ్పూర్ టెస్టులో సూర్యను ఆడించినా అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే రెండో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టుతో చేరాడు. దీంతో సూర్య బెంచ్ కే పరిమితమయ్యాడు. తొలి రెండు టెస్టులకు కాకపోయినా తర్వాత రెండు టెస్టులకైనా సర్ఫరాజ్ కు చోటు దక్కొచ్చని వాదనలు వినిపించాయి.
చేతన్ శర్మ కూడా తన స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఇదే విషయాన్ని చెప్పాడు. భారత క్రికెట్ జట్టులో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల వల్లే సంజూ శాంసన్, శిఖర్ ధావన్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశాలు దక్కడం లేదని వాపోయాడు. అతడి రాజీనామాతో అయినా సర్ఫరాజ్ కు న్యాయం దక్కొచ్చని చాలా మంది ఆశించారు.
కానీ తాజాగా బీసీసీఐ ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు, మూడు వన్డేలకు జట్లను ప్రకటించింది. సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. కనీసం జట్టులోకి తీసుకుని ఆడించకుండా బెంచ్ కు పరిమితం చేసినా ఇప్పుడు కాకుంటే మరో టెస్టులో అయినా ఛాన్స్ దొరుకుతుందనే ఆశ ఉండేది. కానీ అసలు జట్టులో కూడా చోటు దొరక్కుండా చేయడం అనేది అతడి టాలెంట్ ను అణగదొక్కడమేనని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెఎల్ రాహుల్ పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్నా అతడికి టీమ్ మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలిస్తున్నది. రాహుల్ ను తొలగించాలని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ నిన్న ట్వీట్లలో మండిపడ్డారు. పేలవ ఫామ్ లో ఉన్న అతడికి టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు మద్దతిస్తున్నదో అర్థం కావడం లేదని.. కానీ అతడిని కొనసాగిచండం అంటే భారత క్రికెట్ లో బ్యాటర్లకు కొదవ ఉందని చెప్పడమేనని అతడు ఘాటు వ్యాఖ్యలు చేసినా సెలక్టర్లు వీటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు.
టీమ్ లో కెప్టెన్, హెడ్ కోచ్ మద్దతో లేక బోర్డులో పెద్ద తలకాయల అండదండలు ఉంటే చాలు నెగ్గుకురావచ్చన్న ధోరణిలో టీమ్ సెలక్షన్స్ జరుగుతున్నాయే తప్ప ప్రతిభకు పట్టం కట్టడంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ దారుణంగా విఫలమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. చేతన్ శర్మ వీడియో తర్వాత అయినా సెలక్షన్ కమిటీ మారుతుందన్న ఆశలు మెదిలినా వాళ్లు మాత్రం మూస ధోరణి లోనే వెళ్తుండటం గమనార్హం.
2019-20 రంజీ సీజన్లో 6 మ్యాచుల్లో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్, గత 2021-22 సీజన్లో 6 మ్యాచులు ఆడి 2 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలతో 982 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో కూడా అతడు.. రెండు సెంచరీలు సాధించి 500 ప్లస్ స్కోరు చేశాడు. అయినా నిరీక్షణ మాత్రం తప్పలేదు.