- Home
- Sports
- Cricket
- చెప్పి మరీ సచిన్ టెండూల్కర్ని అవుట్ చేశా! ఒక్కసారిగా స్టేడియమంతా ఖాళీ... - షోయబ్ అక్తర్...
చెప్పి మరీ సచిన్ టెండూల్కర్ని అవుట్ చేశా! ఒక్కసారిగా స్టేడియమంతా ఖాళీ... - షోయబ్ అక్తర్...
సచిన్ టెండూల్కర్కి వచ్చిన క్రేజ్, పాపులారిటీ, మాస్ ఫాలోయింగ్ ముందు ధోనీ, రోహిత్, విరాట్ కోహ్లీ వంటి వారంతా చిన్న పిల్లలే. క్రికెట్ ఆటను మారుమూల పల్లెల్లోకి తీసుకెళ్లి, టీమిండియా ఆడాలనే కసిని బడి పిల్లల్లో పుట్టించిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్... సచిన్, షోయబ్ అక్తర్ మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా ఉండేది..

కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సచిన్ని అవుట్ చేయాలని అప్పటి బౌలర్లు కలలు కనేవాళ్లు. వారిలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఒకడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, 1999 కోల్కత్తా టెస్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు..
1999 ఏషియన్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ని గోల్డెన్ డకౌట్ చేసి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు షోయబ్ అక్తర్...
‘సచిన్ టెండూల్కర్ని మొదటి బాల్కి బౌల్డ్ చేసిన తర్వాత నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతకుముందు చాలా మంది భారత క్రికెటర్లను కలిశాను. నేను క్రికెట్ దేవుడిని చూడాలనుకుంటున్నా అని చెప్పా... వాళ్లు అతను నీకు తెలీదా? అని అడిగారు...
నేను అతన్ని నా మొదటి బంతికే అవుట్ చేయాలని అనుకుంటున్నా.. అందుకే అతన్ని చూడాలనుకుంటున్నా.. అని చెప్పాను. వాళ్లు నవ్వేసి ఊరుకున్నారు. సచిన్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. అంతకుమించి చాలా మంచి మనసున్న మనిషి...
సచిన్ టెండూల్కర్ క్రీజులోకి రాగానే అతని దగ్గరికి వెళ్లా... పైనుంచి కింది దాకా చూశా... ‘బ్రదర్... నా బౌలింగ్లో నువ్వు ఆడలేవు...’ అని చెప్పి, మొట్టమొదటి బంతికే క్లీన్ బౌల్డ్ చేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్. ఇదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది...
సచిన్ టెండూల్కర్ సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో షోయబ్ అక్తర్ అడ్డుగా వచ్చాడు. దీంతో అక్తర్కి తగిలి టెండూల్కర్ కిందపడిపోవడం, ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తగలడంతో అంపైర్ అవుట్గా ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో స్టేడియానికి వచ్చిన భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోయారు...
పాకిస్తాన్ టీమ్పై, అంపైర్ల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, ఫ్లకార్డులు విసరడం మొదలెట్టారు. టీమిండియా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీ కూడా చేయాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్, జగన్మోహన్ దాల్మియా వచ్చి శాంతించాల్సిందిగా అభిమానులను కోరిన ఫలితం లేకపోయింది. దీనిపై కూడా షోయబ్ అక్తర్ కామెంట్ చేశాడు...
‘నాకు తెలిసి ఓ టెస్టు మ్యాచ్ చూడడానికి 70-80 వేల మంది స్టేడియానిక రావడం అదే మొదటిసారి అనుకంటా. నా వల్ల టెస్టు మ్యాచ్ రెండు గంటల పాటు ఆగిపోయింది. దాదాపు లక్షమంది మధ్య ప్రారంభమైన మ్యాచ్, కొద్దిసేపటికే ఎవ్వరూ లేకుండా ఆడాల్సి వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...
తొలి ఇన్నింగ్స్లో మొట్టమొదటి బంతికే సచిన్ టెండూల్కర్ని క్లీన్ బౌల్డ్ చేశాడు షోయబ్ అక్తర్. సచిన్ టెస్టు కెరీర్లో ఇదే మొదటి, ఆఖరి గోల్డెన్ డకౌట్. తీవ్ర వివాదాస్పద మ్యాచుల్లో ఒకటిగా నిలిచిన 1999 కోల్కత్తా టెస్టులో పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో విజయం అందుకుంది.