- Home
- Sports
- Cricket
- ‘పాండ్యా ఒక్క ఐపీఎల్ ట్రోఫీనే గెలిచాడు కదా.. అలా అయితే రోహిత్ ఐదు సార్లు నెగ్గాడు.. మరి దానికేమంటారు..?’
‘పాండ్యా ఒక్క ఐపీఎల్ ట్రోఫీనే గెలిచాడు కదా.. అలా అయితే రోహిత్ ఐదు సార్లు నెగ్గాడు.. మరి దానికేమంటారు..?’
టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ లోనే ఇంటిముఖం పట్టిన భారత జట్టుపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా సారథి రోహిత్ శర్మను టీ20ల నుంచి తప్పించాలనే వాదన రోజురోజుకూ బలపడుతోంది.

Image credit: Getty
ఒక్క ఐసీసీ టోర్నీ కూడా నెగ్గడం లేదనే కారణంతో విరాట్ కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు ఆ పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్ అయితే తప్పకుండా ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ అంచనాలు తలకిందులయ్యాయి. రోహిత్ శర్మ కూడా ఐసీసీ టోర్నీలలో భారత్ కథను మార్చలేకపోయాడు.
సెమీస్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పజెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. రోహిత్ ను టెస్టు, వన్డేలకు పరిమితం చేసి టీ20 పగ్గాలను పాండ్యాకు అప్పజెప్పి జట్టులో ప్రక్షాళన చేయాలని సూచిస్తున్నారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అయితే పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్ మాత్రం ఇందుకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ చేయాలని వస్తున్న వాదనలకు భట్ కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక్క ట్రోఫీ నెగ్గినందుకే పాండ్యాను టీమిండియా సారథి చేయాలని చూస్తే.. మరి ఐదు ట్రోఫీలు నెగ్గిన రోహిత్ సంగతేంటని ప్రశ్నించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో భట్ మాట్లాడుతూ... ‘అసలు పాండ్యాను టీమిండియా కెప్టెన్ గా ఎవరు ముందుకు తీసుకువస్తున్నారో నాకైతే తెలియడం లేదు. ఇవన్నీ పగటి కలలే. పాండ్యా టాలెంటెడ్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు.టీమిండియాతో పాటు గుజరాత్ టైటాన్స్ తరఫున అతడి విజయాలు మనం చూశాం.
Image credit: PTI
గుజరాత్ టైటాన్స్ కు పాండ్యా ట్రోఫీని అందించాడు కరక్టే.. మరి అలా చూస్తే ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఐదు ట్రోఫీలు నెగ్గాడు కదా. కొన్ని మ్యాచ్ లలో బాగా ఆడినంత మాత్రానా అతడిని జట్టుకు కెప్టెన్ గా చేయాలనడం సరైనవాదన కాదు.
క్రికెట్ గురించి సరైన అవగాహన లేనివారే ఇలాంటి కామెంట్లు చేస్తారు. ప్రపంచకప్ లో 16 జట్లు ఆడాయి. అందులో సూపర్-12 ఆడిన జట్లలో నాలుగు సెమీస్ కు చేరాయి. ఫైనల్ కు చేరిన రెండు జట్లలో ఒక్క జట్టు (ఇంగ్లాండ్) ట్రోఫీ నెగ్గింది. అంటే ఆ జట్టు తప్ప మిగిలిన జట్లన్నీ సారథులను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదెక్కడి పనికిమాలిన వాదన..’అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా తమ తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టీమిండియా.. గ్రూప్ స్టేజ్ లో సౌతాఫ్రికాతో తప్ప మిగిలిన నాలుగు మ్యాచ్ లలో గెలిచింది. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టిన విషయం విదితమే.