ఎమ్మెస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ను సరిగ్గా వాడుకోలేదు, ఆ సత్తా కూడా లేదు... పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా
సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో కొనసాగించిన లెజెండ్. ఎమ్మెస్ ధోనీ... భారత జట్టుకి రెండు వరల్డ్కప్స్, ఎన్నో టైటిల్స్ అందించిన మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. అయితే ఈ ఇద్దరినీ 50 శాతం కూడా వినియోగించుకోలేదని కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా.
పాక్ మాజీ బ్యాట్స్మెన్, కామెంటేటర్ రమీజ్ రాజా, పాక్ క్రికెట్ బోర్డుకి చురకలు అంటించాడు. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా, యువకుల సత్తాను పరీక్షించకుండా పాక్ క్రికెట్ బోర్డు తప్పు చేస్తోందని ఎద్దేవా చేశాడు.
పాకిస్తాన్ జట్టు జింబాబ్వే టూర్లో టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలిచింది, టెస్టులను అయితే 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. అయితే క్రికెట్లో పసికూనగా భావించే జింబాబ్వేతో వరుస సిరీస్లు ఆడుతూ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను ఓడించినట్టుగా ఫీల్ అవుతోంది పాక్.
‘జింబాబ్వే వంటి చిన్న జట్లతో ఆడినప్పుడు అయినా కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. కుర్రాళ్లు ఓడినా, వారికి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిన అనుభవం సంపాదించడానికి ఇలాంటి సిరీస్లు ఉపయోగపడతాయి.
ఒకవేళ ఓడినా కొత్త కుర్రాళ్లలో ఉన్న సత్తాను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎవరైనా ప్లేయర్ ఫెయిల్ అయితే, అతని స్థానంలో మరో యువకుడికి అవకాశం ఇవ్వొచ్చు.
ఇప్పటికే జట్టులో ఉన్న పాత ప్లేయర్లను ఇలాంటి సిరీస్ల్లో ఆడించి, ఏం నిరూపించుకుందామనుకుంటున్నారు. మన ప్లేయర్ల దగ్గర అలాంటి సత్తా లేదా? లేదంటే వాళ్లని ఓడించి, మేం గొప్పలేం అని చెప్పాలనుకుంటున్నారా?
మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్... వారిని టీమిండియా 50 శాతం కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పటికీ వాళ్లు భారత జట్టుకి చాలా చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో తమకంటూ ఓ ముద్ర వేసుకున్నారు.
కానీ మనం మ్యాచులు ఓడిపోతామనే భయంతో కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. విజయాల కోసం ప్రయత్నిస్తూ జట్టును, సిస్టమ్ను నాశనం చేస్తున్నాం...
జట్టుతో పాటు రిజర్వు బెంచ్ కూడా బలంగా ఉన్నప్పుడే, ఆ జట్టు టాప్ టీమ్గా గుర్తించబడుతుంది. కానీ పాక్ మాత్రం అలా చేయడం లేదు. ఎప్పుడైనా మ్యాచులు ఓడిపోయి, ఒత్తిడి పెరిగితే పాత ప్లేయర్లను జట్టులోకి రావాలని పిలుస్తున్నారు.
ఇంకా ప్రెషర్ పెరిగితే, పిక్సర్లను పిలుస్తున్నారు. మరీ పెరిగిపోతే ఎక్స్ట్రా వికెట్ కీపర్ను, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు పాక్ జట్టు నిర్మాణం ఇలా ఉంది.
ఇలాగే కొనసాగితే సత్తా ఉన్న యువకులకు జట్టులో అవకాశం ఎప్పుడు దొరుకుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల స్టార్లు ఎలా తయారవుతారు?’ అంటూ పీసీబీపై విమర్శల వర్షం కురిపించాడు రమీజ్ రాజా.