Champions Trophy: తన మనసులోని మాటను బయటపెట్టిన రోహిత్ శర్మ !
IND vs NZ champions trophy 2025: భారత జట్టు చరిత్ర సృష్టించింది. 12 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ను గెలుచుకుంది. దీని తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

Image Credit: Getty Images
IND vs NZ champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలన్నింటినీ తోసిపుచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అలాగే, వన్డే క్రికెట్ కు ఇప్పుడే వీడ్కోలు చెప్పడం లేదని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటన సమయం నుండి, రోహిత్ శర్మ కెప్టెన్సీ, జట్టులో అతని స్థానంపై ఊహాగానాలు ఉన్నాయి, కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్కు జీవం పోషిందని చెప్పాలి.
Rohit Sharma with Champions Trophy
నేను రిటైర్మెంట్ తీసుకోవడం లేదు : రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'నేను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదు. దయచేసి పుకార్ల వ్యాప్తి ఆపండి. అలాగే, భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవు. ఏమి జరుగుతుందో, అది కొనసాగుతుంది. పవర్ప్లేలో దూకుడుగా ఆడాలనే నిర్ణయం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నానని' రోహిత్ శర్మ అన్నారు.
Image Credit: Getty Images
నేను కొత్తగా భిన్నంగా చేసిందేమీ లేదని చెప్పిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ మాట్లాడుతూ, 'నేను ఈ రోజు భిన్నంగా ఏమీ చేయలేదు. గత మూడు-నాలుగు మ్యాచ్లలో నేను అదే చేస్తున్నాను. పవర్ప్లేలో పరుగులు సాధించడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు ఎందుకంటే 10 ఓవర్ల తర్వాత, ఫీల్డ్ విస్తరించి స్పిన్నర్లు వచ్చినప్పుడు పరుగులు సాధించడం కష్టమవుతుందని మనం చూశాము. అందుకే ఒకే రకమైన ఆటతీరును టోర్నీ ఆరంభం నుంచి చేస్తున్నాను' అని రోహిత్ చెప్పాడు.
Image Credit: Getty Images
అవునూ దుబాయ్ పిచ్ పై పరుగులు చేయడం కష్టమైంది : రోహిత్ శర్మ
రోహిత్ శర్మ దుబాయ్ పిచ్ విషయాలు కూడా మాట్లాడారు. 'పిచ్ నెమ్మదిగా ఉంది. పరుగులు చేయడం మరింత కష్టమైంది. అటువంటి పరిస్థితిలో ప్రారంభం నుండే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. నేను ఎవరిపై పరుగులు తీయగలనో ఆ బౌలర్ను ఎంచుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఎక్కువ పరుగులు రావడం కష్టం. అందుకే పది ఓవర్ల తర్వాత కూడా నేను ఓపికగా ఉండాల్సి వచ్చింది కాబట్టి నా ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నాను' అని చెప్పాడు.
జట్టు విజయానికి తోడ్పడటం చాలా సంతృప్తికరంగా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. 'మీరు మ్యాచ్ గెలిచి దానికి దోహదపడినప్పుడు, అది మరింత సంతోషంగా అనిపిస్తుంది. 2019 ప్రపంచ కప్లో నేను కూడా చాలా దోహదపడ్డాను, కానీ మేము గెలవలేకపోయాము కాబట్టి నేను దానిని ఆస్వాదించలేదు. మీరు కొన్ని పరుగులు చేసి గెలిస్తే, మీకు ఎక్కువ ఆనందం లభిస్తుందని' చెప్పాడు.
Image Credit: Getty Images
రాహుల్ను ఆరో స్థానంలో పంపడంపై రోహిత్ ఏమన్నారంటే..?
కేఎల్ రాహుల్ను ఆరో స్థానంలో పంపాలనే నిర్ణయం కూడా చాలా చర్చ జరిగింది. అయితే కొత్త పాత్రలో అతను స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడని చూసి యాజమాన్యం సంతోషంగా ఉందని రోహిత్ అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం ముఖ్యమని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయించేటప్పుడు, అతను ఒత్తిడిని చాలా బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు. మిడిల్ ఆర్డర్లో ప్రశాంతమైన విధానాన్ని కోరుకున్నామనీ, అందుకే అక్షర్ను ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పాడు.
Rohit Sharma
కేఎల్ రాహుల్ అత్యంత ప్రత్యేకమైన ప్లేయర్ : రోహిత్ శర్మ
'కేఎల్ చాలా సంవత్సరాలుగా జట్టు కోసం చాలా సవాలుతో కూడిన పనులు చేస్తున్నాడు. అతను సెమీ-ఫైనల్స్, ఫైనల్ రెండింటిలోనూ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను 70-80 పరుగులు చేసి ఉండకపోవచ్చు, కానీ అతని 30-40 పరుగులు చాలా ముఖ్యమైనవి. అతను జట్టు ఎలాంటి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా ప్రశాంతంగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ రూమ్కు ఆ ప్రశాంతతను తీసుకువస్తాడని మాకు తెలుసని రోహిత్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాన్ని రోహిత్ శర్మ దేశానికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. 'ఈ విజయం మొత్తం దేశానికే ఎందుకంటే దేశం మనతో ఉందని నాకు తెలుసు. ఏదైనా టోర్నమెంట్లో ముఖ్యంగా భారతదేశంలో, మీరు ఫైనల్ గెలిచినప్పుడు, మేము ఎక్కడ ఆడినా, మాకు పూర్తి మద్దతు లభిస్తుందని మాకు తెలుసు' అని రోహిత్ అన్నాడు.