- Home
- Sports
- Cricket
- 10లో ఏడు సార్లు విరాట్ కోహ్లీయే... టీ20ల్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్లు వీరే...
10లో ఏడు సార్లు విరాట్ కోహ్లీయే... టీ20ల్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్లు వీరే...
పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఫ్యాన్స్కి పూనకాలు మొదలైపోతాయి. రిజల్ట్ కాస్త తేడా వస్తే, ఇక తీవ్ర పరిణామాలు ఫేస్ చేయడానికి క్రికెటర్లు సిద్ధంగా ఉండాల్సిందే. అదేంటో కానీ పొట్టి ఫార్మాట్ మొదలైన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు పూర్తిగా రద్దయ్యిపోయాయి. అందుకే గత 15 ఏళ్లల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడింది పట్టుమని 10 మ్యాచుల్లోనే...

2007 టీ20 వరల్డ్ కప్లో రెండు సార్లు తలబడ్డాయి ఇండియా, పాకిస్తాన్. గ్రూప్ డీలో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అప్పటికి సూపర్ ఓవర్ ద్వారా రిజల్ట్ తేల్చే విధానం అమలులోకి రాలేదు. దీంతో టీమిండియా, బాల్-అవుట్లో పాక్ని ఓడించింది... ఈ మ్యాచ్లో 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు...
టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్లో మరోసారి తలబడ్డాయి భారత్, పాకిస్తాన్. తీవ్ర ఉత్కంఠ మధ్య నడిచిన ఈ ఫైనల్ మ్యాచ్లో 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు గౌతమ్ గంభీర్. ఈ మ్యాచ్లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని, మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది...
2007 తర్వాత ఐదేళ్లకు 2012 టీ20 వరల్డ్ కప్లో మళ్లీ తలబడ్డాయి భారత్, పాకిస్తాన్. ఈ మ్యాచ్లో పాక్ 128 పరుగులకి ఆలౌట్ కాగా 61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, నాటౌట్గా నిలిచి... మ్యాచ్ని ముగించాడు...
2012లో చివరిసారిగా భారత పర్యటనకు వచ్చింది పాకిస్తాన్. ఈ టూర్లో రెండు టీ20 మ్యాచులు జరిగాయి. బెంగళూరులో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులే చేసింది. 41 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 43 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టార్గెట్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది పాకిస్తాన్...
అహ్మదాబాద్లో జరిగిన రెండో టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. 36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, భారత జట్టు తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు సిరీస్ని డ్రా చేసింది...
2014 టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 130/7 స్కోరు చేసింది. 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లీతో పాటు సురేష్ రైనా 35 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
2016 టీ20 వరల్డ్ కప్లోనూ పాక్పై ప్రతాపం చూపించాడు విరాట్ కోహ్లీ. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 118 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన విరాట్ కోహ్లీ మ్యాచ్ని 15.5 ఓవర్లలోనే ముగించాడు...
2016 ఆసియా కప్లో భారత్ చేతుల్లో ఘోర పరాజయం ఎదుర్కొంది పాకిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ, రహానే డకౌట్ కాగా, రైనా 1 పరుగుకే అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది..
అయితే బ్యాటింగ్కి కష్టసాధ్యంగా ఉన్న పిచ్పై 51 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ ఆడిన అతి గొప్ప టీ20 ఇన్నింగ్స్ల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది.
2016 ఆసియా కప్ తర్వాత మళ్లీ ఐదేళ్లకు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనే భారత్, పాకిస్తాన్ తలబడ్డాయి. ఈసారి కూడా విరాట్ కోహ్లీయే టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 0, కెఎల్ రాహుల్ 3 పరుగులు చేసి అవుట్ కావడంతో కష్టాల్లో పడిన భారత జట్టును 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 57 పరుగులు చేసి ఆదుకున్నాడు విరాట్ కోహ్లీ. భారత జట్టు 151 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది పాకిస్తాన్...
Image credit: Getty
ఆసియా కప్ 2022 టోర్నీలోనూ పాక్తో మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు)తో కలిసి టాప్ స్కోరర్గా నిలిచాడు..
Virat Kohli-Harris Rauf
భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటివరకూ 10 టీ20 మ్యాచులు జరగగా అందులో 7 సార్లు విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. గౌతమ్ గంభీర్ రెండుసార్లు, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా (సంయుక్తంగా) ఒక్కోసారి టాప్ స్కోరర్లుగా నిలిచారు.