అదేం చిన్న యాక్సిడెంట్ కాదు! రిషబ్ పంత్, వన్డే వరల్డ్ కప్ కాదు కదా, వచ్చే ఐపీఎల్ కూడా ఆడలేడు... - ఇషాంత్ శర్మ
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా ఎదుగుతున్న సమయంలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. టీ20ల్లో పక్కనబెడితే వన్డేల్లో, టెస్టుల్లో టీమిండియాకి మ్యాచ్ విన్నర్గా మారిన రిషబ్ పంత్ లేకపోవడం, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో తీవ్రంగా ప్రభావం చూపించింది..
డిసెంబర్ 30, 2022న న్యూఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి వెళుతూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు రిషబ్ పంత్. ఈ ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి నడవడానికే రిషబ్ పంత్కి ఆరు నెలల సమయం పట్టింది..
ఇప్పటికే జిమ్లో వర్కవుట్స్ మొదలుపెట్టిన రిషబ్ పంత్, వీలైనంత త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రిషబ్ పంత్ ఆడతాడని బీసీసీఐ ఆశలు పెట్టుకుంది. అయితే ఇషాంత్ శర్మ మాత్రం అది జరగదని అంటున్నాడు..
‘నా అంచనా ప్రకారం రిషబ్ పంత్, వన్డే వరల్డ్ కప్ 2023 కాదు కదా, వచ్చే ఐపీఎల్ కూడా ఆడలేడు. ఎందుకంటే అతనికి జరిగింది చిన్న ప్రమాదం కాదు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు... అది చాలా సీరియస్ యాక్సిడెంట్...
అవును, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడని, వికెట్ కీపింగ్ మొదలెట్టాడని నేను విన్నాను. అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించి, గేమ్కి సిద్ధం కావడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా వికెట్ కీపింగ్ చాలా క్లిష్టమైన పని..
మంచి విషయం ఏంటంటే అతనికి రెండో సర్జరీ అవసరం లేదని డాక్టర్లు చెప్పడమే. ఒకవేళ అతనికి రెండో సర్జరీ అవసరం అయ్యుండి, కోలుకోవడానికి మరింత సమయం పట్టేది...
యాక్సిడెంట్ తర్వాత అతనికి ఓ సర్జరీ అయ్యింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. వరల్డ్ కప్ 2023లో అయితే రిషబ్ పంత్ ఆడలేడు. వచ్చే ఐపీఎల్ వరకూ అతను ఫిట్నెస్ సాధించినా గొప్పే అనుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ..