నాకు కరోనా రావడానికి వాళ్లే కారణం, ఆ సమయంలో ఏం జరిగిందంటే... సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ...
ఐపీఎల్ 2021 సీజన్కి కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. తొలుత కేకేఆర్ టీమ్లో పాజిటివ్ కేసులు రాగా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లలో పాజిటివ్ కేసులు రావడంతో లీగ్ని నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్ రాగా, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ కూడా కరోనా బారిన పడ్డాడు. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్, బస్ క్లీనర్కి కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది.
‘మేం ఏప్రిల్ 26న ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 28న మాకు కరోనా పరీక్షలు చేశారు. మే 1న ముంబై ఇండియన్స్తో మేం మ్యాచ్ ఆడాం. అప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు.
నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉందని, నాకు కరోనా సోకే అవకాశమే లేదని నేను గట్టిగా నమ్మాను. అయితే మే 2న నాతో పాటు కాశీ విశ్వనాథ్, ఓ స్టాఫ్ సభ్యుడికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్ట్ చూడగానే ఒక్కసారి షాక్ అయ్యాను.
అది తప్పుడు రిపోర్ట్ అయ్యి ఉంటుందని భావించాం. అయితే ఆ తర్వాత మరోసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్గా తేలింది. దాంతో నేను అప్పటికప్పుడూ వేరే గదికి వెళ్లిపోయాను.
కరోనా పాజిటివ్గా తేలిన తర్వాత కొద్దిగా ఇబ్బంది మొదలైంది. తొలుత ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత ముక్కు మూసుకుపోయింది. బయో బబుల్లో ఉంటూ, ప్రోటోకాల్ తప్పకుండా అన్ని నియమాలు పాటించాను. అయినా నాకు పాజిటివ్ వచ్చిందని నమ్మలేకపోయాను.
అయితే ముంబై నుంచి ఢిల్లీకి వచ్చే సమయంలోనే ఎక్కడో తప్పు జరిగింది. ఆ వ్యక్తి వల్లే నాకు కరోనా సోకిందని చెప్పలేను కానీ మా టీమ్లో వాళ్లు కూడా కారణం అయ్యి ఉండొచ్చు. నేను ఐసోలేషన్కి వెళ్లిన తర్వాత నా ఆలోచలన్నీ ఇలాగే తిరిగాయి.
మానసికంగా, శారీరకంగా కరోనా నుంచి బయటపడేందుకు ఏం చేయాలా? అని ఆలోచించాను. మొదట నేను ఏ మాత్రం భయపడలేదు. కానీ నాకు పాజిటివ్ సోకిందని తేలిన తర్వాత మా కుటుంబం, ఫ్రెండ్స్ వరుసగా మెసేజ్లు, కాల్స్ చేయడం మొదలెట్టారు.
వాళ్ల భయాన్ని చూసిన తర్వాత నాలో కూడా భయం మొదలైంది. నా ఆలోచనలు చాలా దూరం వెళ్లాయి. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. రెండు రోజుల తర్వాత నన్ను నేను మానిటర్ చేసుకోవడం మొదలెట్టా.
ఎప్పటికప్పుడు నా హెల్త్ డేటాను తెలుసుకుంటూ, కరోనా నుంచి బయటపడేందుకు ఏం చేయాలో దాన్ని చేశా. నాకు పాజిటివ్ వచ్చిన రోజు నాతో పాటు సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్, రాబిన్ ఊతప్ప, ఛతేశ్వర్ పూజారా, దీపక్ చాహార్ కూడా ఉన్నారు.
వారికి ఏమైనా అవుతుందేననే భయం కూడా నన్ను వెంటాడింది. వారికి పాజిటివ్ వస్తే, దానికి నేను కారణం అవుతానని నన్ను నేను నిందించుకున్నా. నేను భయపడినట్టే హుస్సీకి పాజిటివ్ వచ్చింది.
నా చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించాను. ఐపీఎల్ 2020 సీజన్లో సీఎస్కే క్యాంపులో పాజిటివ్ కేసులు వచ్చాయి. అందుకే ఈసారి మరింత జాగ్రత్తగా కఠినమైన ప్రోటోకాల్తో మార్చి మొదటి వారంలోనే బయో బబుల్ నిర్మించాం.
చెన్నై నుంచి ముంబైకి వెళ్లే సమయంలో కూడా ప్రోటోకాల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే ఢిల్లీకి వచ్చాకే సీన్ మారిపోయింది. అలాగని ఢిల్లీలో మేం నిబంధనలు తప్పలేదు.
బయో బబుల్ నియమాలను పాటించినా పాజిటివ్ కేసులు వచ్చాయంటే, మేం తిరిగిన ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉండి ఉండొచ్చు. మేం ప్రాక్టీస్ చేసిన రోషనారా క్లబ్లో కానీ, లేదా మరేక్కడైనా... అలా చూసినా మేం ఇద్దరం మాత్రమే ఎందుకు పాజిటివ్గా తేలాం?
కరోనా నుంచి బయటపడడం ఓ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లా అనిపించింది. నా కెరీర్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను. కానీ కరోనాతో పోరాటం మాత్రం వాటన్నింటికీ విభిన్నం’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ.