స్టార్క్ కోసం కోట్లు కుమ్మరించేందుకు ఆర్సీబీ రెఢీ... ఉమేశ్ యాదవ్, శ్రీశాంత్ వెళ్లేది ఆ జట్టులోకే...
ఐపీఎల్ 2021 మినీ వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించి మినీ వేలం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో అన్ని జట్లు కలిపి రూ.196 కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి.. ఈ మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
ఉమేశ్ యాదవ్: ఐపీఎల్ 2021 సీజన్కి ముందు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ని మినీ వేలానికి వదిలేసింది ఆర్సీబీ. అయితే ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా ప్రకటించిన వెంటనే, అతను ఆర్సీబీని అన్ఫాలో చేశాడు...
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఉమేశ్ యాదవ్నీ, ఉమేశ్ యాదవ్, సీఎస్కేనీ ట్విట్టర్లో ఫాలో అవ్వడం మొదలెట్టారు. దీంతో ఉమేశ్ యాదవ్, సీఎస్కేలోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు విశ్లేషకులు...
మిచెల్ స్టార్క్: ఐపీఎల్ 2021 సీజన్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్క్ కోసం ఆర్సీబీ విశ్వప్రయత్నాలు చేస్తోందని సమాచారం...
అవసరమైతే మిచెల్ స్టార్క్ను దక్కించుకోవడానికి రూ.15 కోట్లైనా చెల్లించడానికి రాయల్ ఛాలెంజర్స్ వెనకాడబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆర్సీబీ పర్సులో రూ.35.70 కోట్లు ఉన్నాయి.
శ్రీశాంత్: ఏడేళ్ల సస్పెన్షన్ తర్వాత తిరిగి ఐపీఎల్లో ఎంట్రీ ఇస్తున్నాడు శ్రీశాంత్. ఐపీఎల్ వేలానికి తనకి తాను రిజిస్టర్ చేయించుకున్న శ్రీశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం.
స్టీవ్ స్మిత్: గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్ను, ఐపీఎల్ 2021 మినీ వేలానికి వదిలేసింది ఆర్ఆర్. సీనియర్లను ఎక్కువగా నమ్ముకునే చెన్నై సూపర్ కింగ్స్, స్టీవ్ స్మిత్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది... వీరితో పాటు మ్యాక్స్వెల్ను వదిలేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, స్మిత్ను కొనుగులు చేయడానికి పోటీపడొచ్చు.
మ్యాక్స్వెల్: గత సీజన్లో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయిన మ్యాక్స్వెల్ కోసం ఈ సీజన్లో పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. అయితే మ్యాక్స్వెల్ కోసం రూ.3 కోట్ల వరకూ చెల్లించడానికి ఫ్రాంఛైజీలు సిద్ధపడొచ్చు. మ్యాక్స్వెల్ కోసం సీఎస్కే, ఆర్సీబీ పోటీపడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్, గత సీజన్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే ఫించ్ను కొనుగోలు చేయడానికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడే అవకాశం ఉంది.
కేదార్ జాదవ్: గత సీజన్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్లలో కేదార్ జాదవ్ ఒకడు. టీ20ల్లో టెస్టు ఆటతీరు చూపించిన జాదవ్ని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు. గత సీజన్లో అతని కోసం రూ.7 కోట్ల 80 లక్షలు చెల్లించిన సీఎస్కే, ఈసారి తక్కువ ధరకి మళ్లీ అతన్ని జట్టులోకి తీసుకోవచ్చని టాక్.
హర్భజన్ సింగ్: సీఎస్కే నుంచి బయటికి వచ్చిన హర్భజన్ సింగ్ను కొనుగోలు చేయడానికి అతని పాత జట్టు ముంబై ఇండియన్స్ ఆసక్తిచూపే అవకాశం ఉంది. హర్భజన్ సింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కత్తా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ కూడా పోటీపడవచ్చు.
మురళీ విజయ్: చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసిన ప్లేయర్ల జాబితాలో ఉన్న భారత సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్లూ పెద్దగా ఆసక్తి చూపించే అవకాశం కనిపించడం లేదు...