IPL2021: రాజస్థాన్ రాయల్స్కి రెండో విజయం... కేకేఆర్కి వరుసగా నాలుగో ఓటమి...
ఐపీఎల్ 2021 సీజన్లో మరో మ్యాచ్ వన్సైడ్గా మారి, క్రికెట్ ఫ్యాన్స్ను నిరుత్సాహపర్చింది. కేకేఆర్ విధించిన 134 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది రాజస్థాన్ రాయల్స్. రాయల్స్కి ఇది ఈ సీజన్లో రెండో విజయం కాగా, కేకేఆర్కి ఇది వరుసగా నాలుగో పరాజయం..
ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న జోస్ బట్లర్, నేటి మ్యాచ్లో కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. 7 బంతుల్లో ఓ ఫోర్తో 5 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత 17 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, శివమ్ మావి బౌలింగ్లో నాగర్కోటీ పట్టిన అద్భుతమైన క్యాచ్కి పెవిలియన్ చేరాడు...
శివమ్ దూబే, సంజూ శాంసన్ కలిసి మూడో వికెట్కి 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 22 పరుగులు చేసిన శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 5 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్ కలిసి మ్యాచ్ను ముగించారు...
వస్తూనే హిట్టింగ్కి దిగి అవుటయ్యే సంజూ శాంసన్, తన స్టైల్కి విరుద్ధంగా నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. 40 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్లతో 41 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఇది రెండో విజయం కాగా వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన కోల్కత్తా నైట్రైడర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది..