డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కి వరుణ గండం... ఐదురోజులూ వర్షం పడే అవకాశం... రిజల్ట్ సాధ్యమేనా...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కి ఇది నిజంగా చేదు వార్తే.. ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్కి వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ...
ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్లో జూన్ 18, శుక్రవారం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు రెండో సెషన్లో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది...
అలాగే శనివారం కూడా కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలియచేసింది. ఆ తర్వాత మూడో రోజైన ఆదివారం నుంచి ఆటకి కీలకమైన సోమ, మంగళవారాల్లో కూడా చిరుజల్లులతో కూడిన వర్షం ఉంటుందని తెలిపింది.
ఇక్కడి వాతావరణంతో పోలిస్తే సౌంతిప్టన్ వాతావరణం భారత క్రికెటర్లకు పరీక్ష పెట్టనుంది. సగటున 11 డిగ్రీల నుంచి 19 డిగ్రీల మధ్య అక్కడి ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో మనవాళ్లు ఈ వాతావరణానికి అలవాటు పడడం చాలా కీలకం.
నిజానికి ఇక్కడైతే వాతావరణ శాఖ వర్షం కురుస్తుందని చెబితే, ఆ రోజు 99 శాతం చిరుజల్లు కురిసే అవకాశం కూడా ఉండదు. అయితే ఇంగ్లాండ్లో కావడంతో వాళ్ల అంచనాలు ఎంతవరకూ నిజం అవుతాయో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభమయ్యే దాకా వేచి చూడాల్సిందే.
వర్షం కారణంగా ఏ రోజైనా పూర్తి ఓవర్లు పూర్తి చేయలేకపోతే, ఐదు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలకపోతే రిజర్వు డేగా జూన్ 23ని కూడా కేటాయించింది ఐసీసీ. అయితే ఆ రోజు కూడా సౌంతిప్టన్లో చిరుజల్లులతో కూడిన వర్షం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాలంటే ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగాల్సిందే. అలాంటి ఉత్కంఠభరిత మ్యాచులను ఆస్ట్రేలియా పర్యటనలో చూసే అవకాశం దక్కింది. మెల్బోర్న్, సిడ్నీ, గబ్బా టెస్టుల ఐదు రోజుల పాటు పూర్తిగా సాగాయి...
అయితే సౌంతిప్టన్లో మనవాళ్లు ఏ మేరకు రాణిస్తారు, అక్కడి వాతావరణాన్ని, ఏ మాత్రం అంచనా వేయలేని డ్యూక్ బాల్ స్వింగ్కి ఎదురొడ్డి... కివీస్ బౌలింగ్ వేరియేషన్స్ని తట్టుకుని ఎలా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది...
ఒకవేళ భారత జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే, ఫైనల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. అయితే భారీ అంచనాలతో బరిలో దిగిన ప్రతీసారి టీమిండియాకి పరాభవమే ఎదురైంది. దాంతో ఈసారి కూడా ఓటమి తప్పదేమోననే భయం అభిమానుల్లో ఉంది.
అదీకాకుండా అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు దక్కలేదనే వార్త, క్రికెట్ ఫ్యాన్స్ను మరింత నిరుత్సాహానికి గురి చేసింది. జడ్డూ లేకపోతే భారత బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్, బౌలింగ్లో అదనపు బౌలర్లో తగ్గడమే కాకుండా ఓ మెరుపు తీగలాంటి ఫీల్డర్ను టీమిండియా కోల్పోతుంది.