ఇదీ మేడిన్ ఇండియా అంటే : ఐపీఎల్ పై సొట్టబుగ్గల సుందరి కామెంట్స్
IPL Media Rights: ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 2008 లో 8 ఫ్రాంచైజీలతో మొదలైన ఐపీఎల్.. ఇప్పుడు దిగ్గజ లీగ్ లకు సవాల్ విసురుతున్నది. తాజాగా మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జిస్తున్నది.

ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ప్రయాణం సాగిస్తున్న అతికొద్ది మంది ఓనర్లలో పంజాబ్ కింగ్స్ సహ యజమాన ప్రీతి జింటా ఒకరు. 2008 లో ఈ లీగ్ మొదలైనప్పట్నుంచి ఆమె ఐపీఎల్ లో భాగమవుతున్నది.
తాజాగా ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సుమారు రూ. 50 వేల కోట్లు ఆర్జిస్తున్న వేళ ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా అని పేర్కొంది.
2023-27 కాలానికి గాను మీడియా హక్కుల విలువ రూ. 50 వేలకు చేరువవుతున్న తరుణంలో ఆమె ట్విటర్ లో స్పందిస్తూ.. ‘ఐపీఎల్ మీడియా హక్కుల గురించి బీసీసీఐ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ ఎంత అద్భుతమైన క్రీడా ఆస్తిగా మారింది!
ఈ లీగ్ ప్రపంచవ్యాప్తంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ కోట్లాది మందికి వినోదాన్ని అందిస్తున్నది. ప్రపంచంలోని ఇతర క్రీడా లీగ్ లను దాటుకుంటూ ఈస్థాయికి ఎదిగింది ఐపీఎల్. ఈ వృద్ధి అద్భుతం. ఇదీ మేడిన్ ఇండియా అంటే..’ అని ట్వీట్ లో రాసుకొచ్చింది.
ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. ప్రతిభావంతులైన ఆటగాళ్లు, హిట్టర్లు, బౌలర్లకు కొదవలేకున్నా ఆ జట్టు మాత్రం ఇంతవరకు ట్రోఫీని నెగ్గలేదు.
లీగ్ చరిత్రలో ఒకేసారి పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు చేరింది. అయినా ప్రీతి జింటా ఏమాత్రం కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతి సీజన్ లో నూతనోత్సాహంతో తమ జట్టును బరిలోకి దించుతున్నది.
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం గత రెండ్రోజులుగా ముంబైలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మీడియా హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన బీసీసీఐ.. ఎ, బి కి వేలం ప్రక్రియను పూర్తి చేసింది. ఈ రెండింటికీ సుమారు రూ. 44 వేల కోట్ల ధర పలికింది.
ఇక ప్రస్తుతం సి, డి ప్యాకేజీలకు వేలం నిర్వహిస్తున్నారు. వేలంలో పాల్గొన్న పోటీదారులెవరూ హక్కులను దక్కించుకోవడానికి ఎక్కడా తగ్గకుండా పోటీ పడుతుండటం బీసీసీఐకి కలిసివస్తున్నది. వేలం సాగుతున్న తీరు చూస్తుంటే నేటి సాయాంత్రానికైనా ఈ ప్రక్రియ ముగుస్తుందా..? లేదా..? అనేది కూడా అనుమానమే.