కౌంటీలను తాకిన కరోనా వైరస్... ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి పాజిటివ్...
క్రికెట్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేక క్రికెట్ టోర్నీలను, సిరీస్లను వాయిదా వేయించిన కరోనా వైరస్, తాజాగా కౌంటీ ఛాంపియన్షిప్ను కూడా తాకింది...
ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్కి కరోనా పాజిటివ్ వచ్చింది. 30 ఏళ్ల పీటర్, మిడిల్సెక్స్ క్లబ్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు...
హ్యాండ్స్కాంబ్కి కరోనా పాజిటివ్ రావడంతో అతను ఛాంపియన్షిప్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఐర్లాండ్ ప్లేయర్ టిమ్ ముర్టగ్ ఎంపికయ్యాడు...
ఆస్ట్రేలియా తరుపున 2019లో చివరిగా ఆడిన హ్యాండ్స్కాంబ్, యాషెస్ సిరీస్ ఆడే ఆసీస్ జట్టులో చోటు దక్కించుకునేందుకు కౌంటీ ఛాంపియన్షిప్ ఆడి తన ఫామ్ నిరూపించుకోవాలని భావించాడు. అయితే ఏడు మ్యాచుల్లో 17.46 సగటుతో 227 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు పీటర్ హ్యాండ్స్కాంబ్...
కౌంటీలు ఆడుతున్న సమయంలో పీటర్ హ్యాండ్స్కాంబ్కి కరోనా సోకడంతో మిగిలిన ప్లేయర్లు భయాందోళనలకు గురవుతున్నారు. భారత స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కౌంటీ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ సీజన్ మధ్యలో వాయిదా పడగా, లంక ప్రీమియర్ లీగ్, కెనడా టీ20 లీగ్లను కూడా ప్రారంభం కాకుండానే వాయిదా వేయాల్సి వచ్చింది...
భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన సిరీస్పై నీలినీడలు కమ్ముకోగా... ఇప్పటికైతే 13న ప్రారంభం కావాల్సిన వన్డే సిరీస్ను 18న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు లంక బృందంలో మరిన్ని పాజిటివ్ కేసులు వెలుగుచూస్తే, ఈ సిరీస్ రద్దు చేసే అవకాశం ఉంది...
ఇంగ్లాండ్ జట్టు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి రెండు రోజుల ముందు ఇంగ్లాండ్ బృందంలో ఏడు పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో అప్పటికప్పుడు కొత్త జట్టును ఎంపిక చేసి, పాక్తో సిరీస్ ఆడించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...