అలా అయితేనే వన్డే వరల్డ్కప్కు వస్తాం.. కొత్త కొర్రీ పెడుతున్న పాకిస్తాన్..
ఇన్నాళ్లూ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు అహ్మదాబాద్, చెన్నై వేదికలని.. భద్రతా కారణాలనీ చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టింది..!

ఆసియా కప్ వివాదం సద్దుమణిగిందనుకుంటే పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్లో పాల్గొనడంపై ఇప్పటికీ అనిశ్చితిని వీడలేదు. దీంతో వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలలో జాప్యం జరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో కొత్త ట్విస్ట్.
ఇన్నాళ్లూ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు అహ్మదాబాద్, చెన్నై వేదికలని.. భద్రతా కారణాలనీ చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టింది. పాకిస్తాన్ ఆందోళనంతా ఇప్పుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కాదు. 2025లో జరుగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..
ఈ టోర్నీకి కూడా భారత జట్టు.. పాకిస్తాన్ కు జట్టును పంపే అవకాశాలు లేవు. దీంతో పీసీబీ ఇప్పట్నుంచే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. భారత్ రాని పక్షంలో ఆ నష్టాలను భరించేందుకు గాను ఐసీసీ తమకు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే వన్డే వరల్డ్ కప్ లో ఆడతామని కొత్త కొర్రీలు పెట్టినట్టు సమాచారం.
భారత్ ఇదివరకే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని ఐసీసీకి స్పష్టంగా తమ నిర్ణయాన్ని చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మళ్లీ 2025లో చర్చలు జరిపి మధ్యవర్తిత్వాల కంటే తమకు భారత జట్టు రాకపోతే ఏర్పడే నష్టాలపై రాతపూర్వకంగా రాసిస్తే వన్డే వరల్డ్ కప్ వచ్చేందుకు తమకు ఏ అభ్యంతరమూ లేదని ఇదివరకే ఐసీసీ ప్రతినిధులకు చెప్పినట్టు తెలుస్తున్నది.
Image credit: Getty
ఇటీవలే ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అలార్డైస్ లు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పీసీబీ వారికి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. భారత జట్టు ఎలాగూ తమ దేశం రాదు కాబట్టి ఆ నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలని పీసీబీ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.